రాష్ట్రంలో 4 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు
ABN , First Publish Date - 2021-07-26T05:32:37+05:30 IST
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ట్రస్టీ వీవీ విజయ్కుమార్రాజు తెలిపారు. ఆదివారం నెల్లూరులో జరిగిన డిస్ట్రిక్ట్ 316 జిల్లా క్యాబినెట్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు.
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ట్రస్టీ విజయ్కుమార్
నెల్లూరు(సాంస్కృతికం), జూలై 25 : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ట్రస్టీ వీవీ విజయ్కుమార్రాజు తెలిపారు. ఆదివారం నెల్లూరులో జరిగిన డిస్ట్రిక్ట్ 316 జిల్లా క్యాబినెట్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోందన్నారు. క్లబ్ ఇంటర్నేషనల్ ట్రస్టీగా రెండు సార్లు తనకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్రంలో క్లబ్ తరపున 133 కంటి ఆసుపత్రులు, 58 డయాలసిస్ కేంద్రాలు, 52 బ్లడ్బ్యాంకులు పనిచేస్తున్నాయని తెలిపారు. కొత్తగా ఈ ఏడాది తణుకు, నూజివీడు, తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.1.20కోట్లతో డయాలసిస్ కేంద్రాన్ని వచ్చే జనవరికి ఏర్పాటు చేస్తామని చెప్పారు. నెల్లూరులోని బీవీఎస్ బాలికల ఉన్నత పాఠశాల, ఆర్ఎస్ఆర్ ఉన్నత పాఠశాలల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. లయన్స్- 316 జే క్లబ్స్ ఆధ్వర్యంలో 250 మంది కొత్త సభ్యులను చేర్పించినందుకు జిల్లా గవర్నర్ బీ రవికుమార్ బృందాన్ని అభినందించారు.