యూపీ: బీజేపీకి మరో ఎదురు దెబ్బ.. ఎస్పీలోకి నలుగురు ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2022-01-12T02:14:39+05:30 IST

అయితే మొత్తంగా 13 మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరబోతున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ప్రతిరోజు ఈ చేరికల ప్రక్రియ కొనసాగుతుందని ఎన్సీపీ అధినేత పవార్ అన్నారు..

యూపీ: బీజేపీకి మరో ఎదురు దెబ్బ.. ఎస్పీలోకి నలుగురు ఎమ్మెల్యేలు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. యోగి కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య.. భారతీయ జనతా పార్టీకి మంగళవారం రాజీనామా చేసి ఆ వెనువెంటనే సమాజ్‌వాదీ పార్టీలో విషయం తెలిసిందే. అనంతరమే మరో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి సైకిల్ ఎక్కడం గమనార్హం. కార్మిక, ఉపాధి శాఖ మంత్రి అయిన స్వామి ప్రసాద్ మౌర్య తన రాజీనామా అనంతరం మాట్లాడుతూ దళితులు, వెనుకబడిన తరగతులు, రైతులు, నిరుద్యోగ యువత, చిన్నతరహా పరిశ్రమలపై యూపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నందుకు నిరసనగా తాను రాజీనామా చేసినట్టు తెలిపారు.


అయితే మొత్తంగా 13 మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరబోతున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ప్రతిరోజు ఈ చేరికల ప్రక్రియ కొనసాగుతుందని ఎన్సీపీ అధినేత పవార్ అన్నారు. అంతే కాకుండా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో నిర్వహించబోయే మీటింగ్‌లో తాను పాల్గొననున్నట్లు ఆయన ప్రకటించారు. బహుజన్ సమాజ్ పార్టీ నేత అయిన తన ప్రస్థానాన్ని చెప్పుకొచ్చారు. తాను బీఎస్పీని వీడినప్పుడు ఆ పార్టీ రాష్ట్రంలో నెంబర్ వన్ పార్టీ అని, అయితే ఇప్పుడు ఆ పార్టీ ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. అనంతరం బీజేపీలోకి చేరిన 14 ఏళ్ల అనంతరం పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు.


కాగా, మౌర్య రాజీనామా వెనుక వేరే కారణం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మరో అదనపు సీటు కావాలని మౌర్య డిమాండ్ చేశారని, అందుకు పార్టీ సిద్ధంగా లేకపోవడంతోనే ఆయన రాజీనామా చేశారని చెబుతున్నారు. స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేసిన వెంటనే ఆయనతో కలిసి ఉన్న ఓ ఫోటోను సమాజ్‌వాదీ పార్టీ నేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ షేర్ చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాటం జరుపుతున్న పాపులర్ నేత స్వామి ప్రసాద్ మౌర్య, అతని సహచరులకు స్వాగతం పలుకుతున్నట్టు ట్వీట్ చేశారు. యూపీలో ఏడు విడతల పోలింగ్ ఫిబ్రవరి 10తో ప్రారంభమై మార్చి 7వ తేదీతో పూర్తవుతాయి. మార్చి 10న ఫలితాలు వెలువడుతాయి.

Updated Date - 2022-01-12T02:14:39+05:30 IST