ఏపీలో 5 గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌లు: కేంద్ర మంత్రి గడ్కరీ

ABN , First Publish Date - 2022-04-06T23:03:40+05:30 IST

భారత్‌మాల పరియోజన తొలి దశ కింద ఆంధ్రప్రదేశ్‌లో అయిదు

ఏపీలో 5 గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌లు: కేంద్ర మంత్రి గడ్కరీ

ఢిల్లీ: భారత్‌మాల పరియోజన తొలి దశ కింద ఆంధ్రప్రదేశ్‌లో అయిదు గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌లు చేపట్టినట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు.  ఈ అయిదు ప్రాజెక్ట్‌లు 2026-27 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ చెప్పారు. అయిదు గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ల వివరాలను ఆయన తన జవాబులో పొందుపరచారు.


అందులో విశాఖపట్నం-రాయపూర్‌ మధ్య 99.63 కిలోమీటర్లు దూరం నిర్మించే ఆరు వరసల జాతీయ రహదారికి 3183 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. వాటిలో ఇప్పటికి 202 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు గడ్కరీ తెలిపారు. ఖమ్మం-దేవరాపల్లి మధ్య 56 కి.మీ దూరం నిర్మించే నాలుగు వరుసల రహదారి (ఎన్‌హెచ్‌ 365బీజీ) కోసం 1281 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. వీటిలో ఇప్పటికి 200 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని ఆయన పేర్కొన్నారు.  చిత్తూరు-థాట్చూర్‌ మధ్య 96 కి.మీ దూరం నిర్మించే ఆరు వరసల రహదారి (ఎన్‌హెచ్‌-716బీ) కోసం 3179 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.  ఇప్పటి వరకు 123 కోట్ల రూపాయలు ఖర్చైందని ఆయన వివరించారు.


బెంగుళూరు-చెన్నై మధ్య 85 కి.మీ దూరం నిర్మించే ఎక్స్‌ప్రెస్‌ వేకు 4137 కోట్లు కేటాయింపులు జరిగాయన్నారు. ఇప్పటికి 123 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు ఆయన తెలిపారు. బెంగుళూరు-విజయవాడ మధ్య 343 కి.మీ దూరం నిర్మించే కారిడార్‌కు సంబంధించి ప్రాజెక్ట్‌ తీరుతెన్నులు, వ్యయానికి సంబంధించి డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ రూపొందించే పని ప్రారంభమైనట్లు మంత్రి గడ్కరీ వివరించారు.

Updated Date - 2022-04-06T23:03:40+05:30 IST