బ్రేకింగ్ : ఏపీ అసెంబ్లీ నుంచి TDP సభ్యుల సస్పెన్షన్
ABN , First Publish Date - 2022-03-14T18:56:59+05:30 IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. సోమవారం నాడు సమావేశాలు ప్రారంభమైనప్పట్నుంచీ టీడీపీ సభ్యులు ఆందోళన చేపడుతున్నారు. ఏపీలో సంచలనంగా మారిన జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోలేదని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెన్షన్ వేశారు. మొత్తం ఐదుగురు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవులు, రామానాయుడు, వీరాంజనేయస్వామి బడ్జెట్ సెషన్ నుంచి పూర్తిగా సస్పెన్షన్కు గురయ్యారు. అయితే తాము అడిగింది ప్రజా సమస్య అని.. దానిపై చర్చించమని అడిగితే సస్పెన్షన్ చేయడం ఎంతవరకూ సమంజమసమని స్పీకర్ పోడియం చుట్టుముట్టి తెలుగుదేశం ఎమ్మెల్యేలు నినాదాలు చేయడం ప్రారంభించారు. సస్పెండ్ చేసినా సభ నుంచి ఎమ్మెల్యేలు కదలకపోవడంతో వారిని బయటికి తీసుకెళ్లాలని మార్షల్స్ను స్పీకర్ ఆదేశించారు. ఈ క్రమంలో నినాదాల మధ్యనే జంగారెడ్డిగూడెం ఘటనపై మంత్రి ఆళ్ల నాని స్టేట్మెంట్ ఇచ్చారు.
స్పీకర్ ఆగ్రహం..
టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. టీడీపీ సభ్యులను బయటకు తీసుకెళ్లాలని మార్షల్స్కు స్పీకర్ ఆదేశించారు. ‘సస్పెండైన సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లాలి. బడ్జెట్పై చర్చ జరగకుండా అడ్డుపడుతున్నారు. మీరుండాల్సింది పోడియం దగ్గర కాదు.. మీ స్థానాల్లో’ అని స్పీకర్ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో ఏపీ అసెంబ్లీలో మరోసారి తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ పోడియం దగ్గర టీడీపీ సభ్యుల ఆందోళనకు దిగి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.