ఇద్దరు స్నేహితులు.. ఐదేళ్ల పరిశోధనలు.. వందలమందికి వినోదం.. ఇంతకీ వారేంచేశారంటే..
ABN , First Publish Date - 2021-12-11T17:43:37+05:30 IST
ఏదైనా పని చేయాలని ధృడంగా అనుకున్నప్పుడు..
ఏదైనా పని చేయాలని ధృడంగా అనుకున్నప్పుడు ఏదీ అడ్డంకి కాదని అంటుంటారు. ఇదే సూత్రంతో రాజస్థాన్లోని భిల్వారాకు చెందిన ఇద్దరు స్నేహితులు అద్భుతాన్ని చేసి చూపారు. కుంభాల్ఘర్లోని కొండలపై 5 సంవత్సరాల పాటు పరిశోధన చేసిన తర్వాత, జడ్ఫా గ్రామంలోని పాసుంద్ కొండను పర్యాటకులకు నూతన గమ్యస్థానంగా అభివృద్ధి చేశారు. గత రెండేళ్లుగా ఈ కొండలపై ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. రాక్ క్లైంబింగ్ను ఆస్వాదించేందుకు స్థానికులు కూడా వెనుకాడటం లేదు. వర్షాకాలంలో పాసుంద్ కొండపై ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అద్భుతమైన దృశ్యాలు వీక్షించవచ్చు. ఈ కొండ ఎక్కినవారు మేఘాల పైకి చేరుకున్న అనుభూతికి లోనవుతారు.
ఈ సందర్భంగా భిల్వారాకు చెందిన నిఖిల్ పంచోలి, రమేష్ ప్రజాపత్ మాట్లాడుతూ పర్వతారోహకులుగా తాము దేశంలోని పలు ప్రాంతాలలో తిరుగుతూ ట్రెక్కింగ్ గురించి ప్రచారం చేశామని తెలిపారు. ఇదే సమయంలో మేవార్లో కూడా ఇలాంటి టూరిస్ట్ పాయింట్ ఏర్పాటు చేయాలని అనిపించిందన్నారు. దీంతో ఈ పాయింట్ను హిమాచల్, ఉత్తరాఖండ్లలోని ట్రెక్కింగ్ పర్వతాల తరహాలో అభివృద్ధి చేశామన్నారు. ఐదు వందల మందికి పైగా పర్యాటకులు ఇక్కడ ట్రెక్కింగ్ చేశారన్నారు. కాగా ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూసేందుకు చాలామంది యువతీయువకులు వస్తున్నారు. సంగీత ప్రియులు కూడా ఇక్కడికి వచ్చి మంచి సంగీతాన్ని ఆస్వాదిస్తుంటారు. ధ్యానం చేయాలనుకునేవారు కూడా ఇక్కడకు వచ్చి ధ్యానం చేస్తుంటారు. కాగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2002లో ప్రపంచ పర్వత దినోత్సవాన్ని ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతియేటా డిసెంబర్ 11న ప్రపంచ పర్వత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.