ఐఓబీ, సెంట్రల్ బ్యాంక్ల్లో 51% వాటా విక్రయం!
ABN , First Publish Date - 2021-06-22T05:47:53+05:30 IST
ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ)ల
- కేబినెట్ ఆమోదమే తరువాయి
- అమ్మకానికి ముందే వీఆర్ఎస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ)ల యాజమాన్యం త్వరలో చేతులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైవేటీకరణలో భాగంగా ఈ రెండు బ్యాంకుల ఈక్విటీలో తొలుత 51 శాతం వాటాను ప్రైవేట్ సంస్థలకు విక్రయించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలోని కార్యదర్శుల కమిటీ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా కేంద్ర కేబినెట్ ఇందుకు ఆమోదం తెలపనుంది.
ఈ ఆర్థిక సంవత్సరంలోనే రెండు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అందులో భాగంగానే ఈ రెండు బ్యాంకుల ప్రైవేటీకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, బ్యాంకింగ్ లా యాక్ట్లో ఇందుకు అవసరమైన చట్ట సవరణలు చేయనుంది.
త్వరలో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం
ప్రైవేటీకరణకు ముందే ఐఓబీ, సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం ఆకర్షణీయమైన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) ప్రకటించబోతోంది. ఉద్యోగుల సంఖ్య తగ్గి జీతాల భారం తగ్గితే దేశ, విదేశీ బ్యాంకులు మంచి ధరతో ఈ రెండు బ్యాంకుల కొనుగోలుకు ముందుకు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
భారీ లాభాల్లో షేర్లు
ప్రైవేటీకరణ వార్తలతో సోమవారం సెంట్రల్ బ్యాంక్, ఐఓబీ షేర్లు ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్ బ్రేకర్లను తాకాయి. సెంట్రల్ బ్యాంక్ షేరు 20 శాతం లాభంతో రూ.24.30 వద్ద, ఐఓబీ షేరు 20 శాతం లాభంతో రూ.23.60 స్థాయికి చేరి 52 వారాల గరిష్ఠ స్థాయి వద్ద ముగిశాయి. ఈ రెండు కౌంటర్లలో ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా సోమవారం భారీగా పెరిగాయి. ఈ వార్తలతో సోమవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లన్నీ సగటున నాలుగు శాతం వరకు లాభాలు నమోదు చేశాయి.