రైతుల ఖాతాల్లో 516.95 కోట్లు జమ

ABN , First Publish Date - 2021-06-16T09:34:56+05:30 IST

రైతుబంధు పథకం కింద మంగళవారం తొలిరోజు రూ.516.95 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

రైతుల ఖాతాల్లో 516.95 కోట్లు జమ

నేడు రెండెకరాల లోపు ఉన్నవారికి: నిరంజన్‌రెడ్డి 

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): రైతుబంధు పథకం కింద మంగళవారం తొలిరోజు రూ.516.95 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఎకరంలోపు భూమి ఉన్న 16,95,601 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో వీటిని జమ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తంగా తొలిరోజు రాష్ట్రంలో 10,33,915 ఎకరాలకు పెట్టుబడి సాయం అందిందని తెలిపారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 1,11,970 మంది రైతుల ఖాతాల్లో రూ.36.10 కోట్లు, అత్యల్పంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 9,628 మంది రైతుల ఖాతాల్లోకి రూ.35.60 లక్షలు జమ చేసినట్లు చెప్పారు. ఇక బుధవారం రెండెకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండెకరాల లోపు భూమి ఉన్న రైతులు 15.07 లక్షల మంది ఉన్నారని, వీరికి రూ.1152.46 కోట్లు సాయం అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2021-06-16T09:34:56+05:30 IST