Shocking : భాగ్యనగరంలో 6 రోజుల్లో 6 ఘటనలు.. బాధితుల్లో ఆరుగురూ బాలికలే.. ఎందుకిలా..
ABN , First Publish Date - 2022-06-09T18:02:44+05:30 IST
మైనర్లే అయినా కొందరు మేజర్ తప్పులు చేస్తున్నారు. నగరంలో వెలుగు చూస్తున్న వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి..
- నిందితుల్లోనూ ఐదుగురు మైనర్లు
హైదరాబాద్ సిటీ : మైనర్లే అయినా కొందరు మేజర్ తప్పులు చేస్తున్నారు. నగరంలో వెలుగు చూస్తున్న వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఆరు రోజుల్లో నగరంలో వెలుగు చూసిన ఐదు అత్యాచార ఘటనల్లో బాధితులందరూ మైనర్లే కాగా, నిందితుల్లోనూ ఐదుగురు మైనర్లు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల వ్యవహారశైలిపై దృష్టి సారించాలని పోలీసులు చెబుతున్నారు. పిల్లలు ఇంట్లో ఎలా ఉంటున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు వంటి విషయాలపై ఓ కన్నేసి ఉంచాలని ఓ పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. మైనర్లను లైంగికంగా వేధిస్తే పోక్సో చట్టం కింద కేసులు తప్పవని చెబుతున్నారు. తమ వెనక పెద్దలు ఉన్నారనే ధీమాతో కొందరు బాలురు దారి తప్పుతున్నారని ఆ అధికారి చెప్పారు.
- ఈ నెల 3న జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో బాలికపై గ్యాంగ్ రేప్. నిందితుల్లో ముగ్గురు మైనర్లు, ఇద్దరు మేజర్లు ఉన్నారు. ఈ ఘటనతో బాధిత కుటుంబంతో పాటు, నిందితుల తల్లిదండ్రులనూ కలవరపాటుకు గురిచేస్తోంది.
- ఈ నెల 4న మొఘల్పురా పీఎస్ పరిధిలో వెలుగు చూసిన మరో ఘటనలో ఓ క్యాబ్ డ్రైవర్ తన మిత్రుడితో కలిసి బాలిక (11)ను కిడ్నాప్ చేసి రంగారెడ్డి జిల్లా, కొందుర్గ్ గ్రామంలో లైంగికదాడికి యత్నించారు. బాలిక అరవడంతో భయపడిన నిందితులు ఆమెను తిరిగి ఇంటి వద్ద వదిలేశారు. నిందితులిద్దరిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.
- ఈ నెల 5న వెలుగు చూసిన ఘటనలో మరో మైనర్ను ఈవెంట్ మేనేజర్ లోబర్చుకున్నాడు. వస్త్ర దుకాణంలో పని చేసే బాలిక (16)కు ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి లంగర్హౌజ్ మొగల్కా నాలా ప్రాంతానికి చెందిన మహ్మద్ సూఫియాన్ ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన బాలిక కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. పోలీసులు నిందితుడిపై కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
- ఈ నెల 6న మరో దారుణం. అనాథాశ్రమంలో ఉంటున్న బాలికతో పరిచయం పెంచుకున్న సురేష్ (23) ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి సెల్ఫోన్ కొనిచ్చాడు. ఆమె స్నేహితుడి పుట్టినరోజు కోసం నెక్లెస్రోడ్డు వద్దకు వెళ్లింది. విషయం తెలుసుకుని అతనూ వెళ్లాడు. ఆమెను కారులో ఎక్కించుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక అనాథాశ్రమ నిర్వాహకులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
- ఈ నెల 7న కార్ఖానా పీఎస్ పరిధిలో మరో ఘోరం వెలుగు చూసింది. రెండు నెలలుగా ఇద్దరు మైనర్లు, ముగ్గురు మేజర్లు కలిసి బాలికను బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఓ వైద్యురాలి చొరవతో ఆ బాలిక జరిగిన ఘోరాన్ని పోలీసులకు తెలిపింది. పోలీసుల నిందితులను అరెస్టు చేసి, మైనర్లను జువెనైల్ హోంకు తరలించారు.
- ఈ నెల 8న (బుధవారం) మాయమాటలు చెప్పి బాలికను మేనమామ ఇతర రాష్ట్రానికి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.