ఇంత ఘోరమా..? 65 ఏళ్ల ఈ వృద్ధుడి నోటిని దారంతో ఇలా కుట్టేయడం వెనుక అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2021-07-16T23:25:20+05:30 IST

65 ఏళ్ల వృద్ధుడి నోటిని దారంతో కుట్టేసి, అతన్ని బలవంతంగా తీసుకెళ్లి రైల్వే ట్రాక్‌పై పడేస్తే ఎక్కడ తప్పించుకుంటాడో అనే అనుమానంతో పట్టాలకు తాడుతో కట్టేశారు.

ఇంత ఘోరమా..? 65 ఏళ్ల ఈ వృద్ధుడి నోటిని దారంతో ఇలా కుట్టేయడం వెనుక అసలు కథేంటంటే..

రాంచీ: 65 ఏళ్ల వృద్ధుడి నోటిని దారంతో కుట్టేసి, అతన్ని బలవంతంగా తీసుకెళ్లి రైల్వే ట్రాక్‌పై పడేస్తే ఎక్కడ తప్పించుకుంటాడో అనే అనుమానంతో పట్టాలకు తాడుతో కట్టేశారు. అయితే రైలు కింద పడి మరణిస్తాడనుకున్న ఆ వృద్ధుడికి ఇంకా భూమిపై నూకలు ఉన్నాయి. దీంతో ఆ పట్టాలపై రైలు రావడానికి ముందే తెల్లవారుజామునే అటుగా వెళ్లిన కొందరు గ్రామస్తులు.. పట్టాలపై పడి ఉన్న వృద్ధుడిని చూసి కాపాడారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని పలామూ జిల్లాలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన భోలా రాం(64) కొన్నేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య సబితా దేవికి అప్పటికే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయినాసరే ఆమెను భోలారాం పెళ్లి చేసుకున్నాడు.


అలా పెళ్లి చేసుకోవడమే భోలారామ్‌ ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ బుధవారం అర్ధరాత్రి సబిత కుమారుడు, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి భోలారాంపై దాడి చేశాడు. కొట్టడంతో ఆగకుండా బలవంతంగా భోలారాం పెదాలను తాడుతో కుట్టేశాడు. ఆ తర్వాత అతని కాళ్లు చేతులు కూడా బంధించి, గ్రామానికి దగ్గర్లోని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి మళ్లీ ఎక్కడ తప్పించుకుంటాడో అనే భయంతో, పట్టాలకు భోలారాంను తాడుతో కట్టేసి, పట్టాల మధ్యలో అతన్ని పడేసి వచ్చారు. 


అయితే తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తున్న ఒక గ్రామస్థుడు.. రైల్వే పట్టాలపై ఒక వ్యక్తి పడి ఉన్నట్లు గుర్తించాడు. దగ్గరకు వెళ్లి చూసి ఆ వ్యక్తి బతికే ఉన్నట్లు తెలియడంతో వెంటనే పక్కన ఉన్న రాళ్లతో అతని కట్లు తెంపాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న మరికొందరు గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. భోలారాంను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి నోటికి ఉన్న కుట్లు తెంపించారు. ఆ తర్వాత అతను అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-16T23:25:20+05:30 IST