Indian Army : లడఖ్‌లో వాహన ప్రమాదం... ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు సైనికులు...

ABN , First Publish Date - 2022-05-27T22:36:41+05:30 IST

లడఖ్‌లోని టుర్టుక్ సెక్టర్‌లో శుక్రవారం జరిగిన వాహన ప్రమాదంలో

Indian Army : లడఖ్‌లో వాహన ప్రమాదం... ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు సైనికులు...

న్యూఢిల్లీ : లడఖ్‌లోని టుర్టుక్ సెక్టర్‌లో శుక్రవారం జరిగిన వాహన ప్రమాదంలో దాదాపు ఏడుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన 19 మందిని ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. ఉత్తమ వైద్య సంరక్షణ సేవలు అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు భారత సైన్యం తెలిపింది. 


భారత సైన్యం వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఈ వాహన ప్రమాదంలో గాయపడినవారికి ఉత్తమ చికిత్సను అందజేసేందుకు కృషి జరుగుతోంది. తీవ్రంగా గాయపడినవారిని విమానం ద్వారా వెస్టర్న్ కమాండ్‌కు తరలించేందుకు భారత వాయు సేన సహకారం కోరారు. 


26 మంది సైనికులు పార్తాపూర్ ట్రాన్సిట్ క్యాంప్ నుంచి హనీఫ్ సబ్ సెక్టర్ ఫార్వర్డ్ లొకేషన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో థోయిసే నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డుపై నుంచి జారిపోయి, ష్యోక్ నదిలో పడిపోయింది. ఈ నది లోతు దాదాపు 50 నుంచి 60 అడుగుల వరకు ఉంటుంది. దీంతో సైనికులంతా గాయపడ్డారు. ప్రయాణిస్తున్న సైనికులందరినీ (26 మందిని) పార్తాపూర్‌లోని 403 ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2022-05-27T22:36:41+05:30 IST