president address to the nation: ప్రతి రంగంలోనూ మహిళలు సత్తా చాటుతున్నారు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ABN , First Publish Date - 2022-08-15T03:27:12+05:30 IST
న్యూఢిల్లీ: భారత్ 76వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటోన్న వేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు.
న్యూఢిల్లీ: భారత్ 76వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటోన్న వేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో లింగ అసమానతలు తగ్గుతున్నాయని, మహిళలు అనేక సవాళ్లను అధిగమించి దూసుకెళ్తున్నారని ముర్ము చెప్పారు. సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం కీలకంగా మారిందన్నారు. దేశ పంచాయితీరాజ్ సంస్థల్లో 14 లక్షలకు పైగా మహిళా ప్రతినిధులు ఎన్నికయ్యారని రాష్ట్రపతి చెప్పారు. ప్రతి రంగంలోనూ మహిళలు సత్తా చాటుతున్నారని ముర్ము ప్రశంసించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమన్నారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆమె ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవాలని చెప్పారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందన్నారు. 2047 నాటికి స్వాతంత్ర్య వీరుల కలలను సాకారం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
కోవిడ్ వేళ భారత్ అనేక సవాళ్లు ఎదుర్కొని నిలబడిందని తద్వారా ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని ముర్ము చెప్పారు. 200 కోట్లకు పైగా వ్యాక్సిన్లు వేసి భారత్ అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ను చేపట్టిందని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత వైద్య సిబ్బంది ఘనతను ఆమె ప్రశంసించారు.
తమ ప్రసంగంలో ముర్ము కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రస్తావించారు. జాతీయ విద్యా విధానం భవిష్యత్ తరాల కోసం అనేక మార్పులు తీసుకువస్తుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు.