హైదరాబాద్ : వేర్వేరు ప్రాంతాల్లో ఎనిమిది మంది అదృశ్యం
ABN , First Publish Date - 2021-03-08T13:27:24+05:30 IST
వేర్వేరు ప్రాంతాల్లో ఎనిమిది మంది అదృశ్యమయ్యారు.
హైదరాబాద్/ఆనంద్బాగ్ : నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎనిమిది మంది అదృశ్యమయ్యారు. తన ముగ్గురు పిల్లలతో కలిసి మహిళ అదృశ్యమైంది. మల్కాజిగిరి బీజేఆర్నగర్లో నివాసముంటున్న జార్జి ఆంథోనీ, రేణుక దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు. ఈ నెల 1న జార్జి అంథోని పని నిమిత్తం విజయవాడకు వెళ్లాడు. అదే రోజు రేణుక తనపిల్లలు జెస్టినామేరి(10), జెస్సికామేరి(8), అలేక్యామేరి(6)తో బయటకు వెళ్లి తిరిగి ఇంటికి లేదు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన జార్జి ఆంథోనీ సోదరి ఆయనకు ఫోన్చేసి సమాచారం ఇచ్చింది. రేణుక భర్త మల్కాజిగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి..
భర్తతో గొడవపడి మనస్థాపం చెంది భార్య ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైంది. మౌలాలి హనుమాన్నగర్లో నివాసముంటు న్న షేక్ వాజిద్, అప్షన్ సుల్తానా(24) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. ఈ నెల 5న వీరి మధ్య చిన్న గొడవజరిగింది. షేక్ వాజిద్ పని కోసం బయటకు వెళ్లొచ్చే సరికి భార్య అప్షన్ సుల్తానా, పిల్లలు మహిన్ సుల్తానా(5), షేక్ హసద్(4) కనిపించలేదు. తెలిసిన చోట వెదికినా ఆచూకీ లభించలేదు. షేక్ వాజిద్ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మిర్జాలగూడలో వృద్ధురాలు..
మిర్జాలగూడ గాయత్రీనిలయంలో తన సోదరుడు శ్రీనివాసన్తో నివాసముంటున్న వృద్ధురాలు విక్టరీ సరోజ(83) ఈ నెల 5న అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఆమెకోసం తెలిసిన చోట వెతికినా ఆచూకీలభించలేదు. సోదరుడు శ్రీనివాసన్ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.