అమ్మ చీరే ఉరితాడై.. ఎనిమిదేళ్ల బాలిక మృతి
ABN , First Publish Date - 2022-05-29T16:56:00+05:30 IST
లాలాపేట్కు చెందిన రాజేష్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య ప్రసన్నజ్యోతి, ముగ్గురు కుమార్తెలున్నారు..
హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : ఇంటి ముందు తల్లి చీరతో (Saree) కట్టిన ఊయల బాలికకు ఉరితాడైంది. ఊయలతో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలికకు చీర మెడకు బిగిసుకుపోవడంతో ఊపిరి ఆడక మృతిచెందింది. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో జరిగింది. లాలాపేట్కు చెందిన రాజేష్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య ప్రసన్నజ్యోతి, ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె కోట ఎలీనా (8) శనివారం ఇంటి ముందు తల్లి చీరను మెట్లకున్న పెద్దమేకుకు కట్టి ఊయల చేసి ఆడుకుంటుండగా బాలిక మెడకు చుట్టుకుపోయి గట్టిగా బిగిసుకుంది. చీరను తీసేందుకు బాలిక ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఊపిరి ఆడక ఎలీనా అక్కడికక్కడే మృతిచెందింది. ఆ సమయంలో తండ్రి ఊరెళ్లినట్లు తెలిపారు. తల్లి ఆలస్యంగా విషయాన్ని తెలుసుకుని బోరుమంది. స్థానికుల ఫిర్యాదు మేరకు లాలాగూడ పోలీసులు చిన్నారి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.