8 యూట్యూబ్ చానళ్లపై వేటు
ABN , First Publish Date - 2022-08-19T06:28:14+05:30 IST
కల్పిత, దేశ వ్యతిరేక వార్తలు, కథనాలు, వీడియోలు ప్రసారం చేస్తున్నాయంటూ ఎనిమిది యూట్యూబ్ చానళ్లపై కేంద్ర ప్రభుత్వం వేటువేసింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక చానల్ కూడా నిలిపివేసినవాటిలో ఉంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 18: కల్పిత, దేశ వ్యతిరేక వార్తలు, కథనాలు, వీడియోలు ప్రసారం చేస్తున్నాయంటూ ఎనిమిది యూట్యూబ్ చానళ్లపై కేంద్ర ప్రభుత్వం వేటువేసింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక చానల్ కూడా నిలిపివేసినవాటిలో ఉంది. అతి సున్నితమైన దేశ రక్షణకు సంబంధించిన అంశాలను కూడా వదిలిపెట్టకుండా, విషం చిమ్మే వీడియోలు ఈ చానళ్లలో పోస్టు అవుతున్నాయని గురువారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. అందువల్లే సమాచార సాంకేతిక నిబంధనలు- 2021 ప్రకారం వీటిపై చర్య తీ సుకున్నట్టు పేర్కొంది. కేంద్రం వేటువేసిన చానళ్లలో లోక్తంత్ర టీవీ, యూ అండ్వీ టీవీ, ఏఏమ్ రజ్వీ, గౌరవ్షలీ పవన్ మిఽథిలాంచల్, సీ టాప్5టీహెచ్, సర్కారీ అప్డేట్స్, సబ్ కుచ్ దేఖోతోపాటు పాకిస్థాన్ చానల్ న్యూస్ కీ దుని యా ఉన్నాయి. ఈ చానళ్లకు 85.73 లక్షలమంది సబ్స్ర్కైబర్లు,114కోట్ల వ్యూస్ ఉండటం గమనార్హం. తప్పుడు, కల్పిత కథనాలు అందిస్తూ.. అవి సరైనదేనని ప్రజలను నమ్మించేందుకు టీవీ న్యూస్ చానళ్ల లోగోలను, యాంకర్ల చిత్రాలను జోడిస్తున్నాయని ఆరోపించారు.
మత నిర్మాణాలను కూల్చేస్తున్న ప్రభుత్వం... మత వేడుకలపై నిషేధం.. భారత్లో ప్రకటించిన మతయుద్ధం..ఇలా ఉద్రిక్తతలను రేపేలా సంచలనాత్మక వీడియోలు, కథనాలు ఉంటున్నాయని పేర్కొంది. కాగా, ప్రమాదకర అంశాలను ప్రచారంలో పెడుతున్నాయంటూ గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటివరకు మొత్తం 102 యూట్యూబ్ చానళ్లను, సోషల్ మీడియా ఖాతాలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.