800 గ్రాముల బంగారం దోపిడీ!
ABN , First Publish Date - 2022-06-30T06:16:23+05:30 IST
నగరంలో భారీ దోపిడీ జరిగింది. ప్రైవేటు గోల్డ్లోన్ కంపెనీ ఏజెంట్ను ఒక వ్యాపారి తన దుకాణానికి పిలిచి సుమారు 800 గ్రాముల బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకుంటున్న సమయంలో ముగ్గురు గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి వారిద్దరినీ తాళ్లతో కట్టేసి బంగారంతో ఉడాయించారు
అజ్మార్ట్ ఏజెంట్ వద్ద రూ.35 లక్షలు
గోల్డ్ లోన్ తీసుకున్న మ్యాట్స్ వ్యాపారి
డబ్బులు అతనికి ఇచ్చి...
బంగారం తీసుకుని ఏజెంట్ సర్దుకుంటుండగా
ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశం
లోన్ ఏజెంట్తోపాటు వ్యాపారిని
తాళ్లతో కట్టేసి బంగారంతో పరారీ
కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
విశాఖపట్నం/సీతంపేట/దొండపర్తి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): నగరంలో భారీ దోపిడీ జరిగింది. ప్రైవేటు గోల్డ్లోన్ కంపెనీ ఏజెంట్ను ఒక వ్యాపారి తన దుకాణానికి పిలిచి సుమారు 800 గ్రాముల బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకుంటున్న సమయంలో ముగ్గురు గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి వారిద్దరినీ తాళ్లతో కట్టేసి బంగారంతో ఉడాయించారు. ఈ ఘటనపై అనుమానాలు వున్నప్పటికీ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. షీలానగర్కు చెందిన ప్రసాద్ దొండపర్తిలోని యమహా షోరూమ్ వెనుక వైపు బీడబ్ల్యూ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఫ్లోర్ మ్యాట్ల దుకాణం నిర్వహిస్తున్నారు. డబ్బులు అవసరం పడడంతో తన వద్ద వున్న బంగారం తనఖా పెట్టాలనుకున్నారు. దీంతో తనకు పరిచయం ఉన్న అజ్మార్ట్ డోర్స్టెప్ గోల్డ్లోన్ కంపెనీలో పనిచేస్తున్న రాజునాయుడుకు ఫోన్ చేశారు. రాజునాయుడు బుధవారం ఉదయం దొండపర్తిలో తనకు తెలిసిన ఆనంద్ అనే ఫైనాన్షియర్ వద్ద సుమారు రూ.35 లక్షలు తీసుకుని 10.30 గంటల సమయంలో ప్రసాద్ దుకాణం వద్దకు వెళ్లాడు. ప్రసాద్ బంగారాన్ని రాజునాయుడు ముందు పెట్టడంతో అతను తన వద్ద వున్న రూ.35 లక్షలను అందజేశాడు. ప్రసాద్ ఆ డబ్బును వెంటనే వేరొకరి ద్వారా ఎక్కడికో పంపించేశారు. అనంతరం రాజునాయుడు బంగారం తీసుకువెళ్లేందుకు బ్యాగ్లో సర్దుకుంటుండగా షాప్ వెనుక డోర్ నుంచి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు లోపలకు ప్రవేశించారు. రాజునాయుడుతోపాటు ప్రసాద్ను గుడ్డ, తాళ్లతో కట్టేసి వేర్వేరు గదుల్లో బంధించారు. అనంతరం బంగారం పట్టుకుని ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గంటసేపటి తర్వాత రాజునాయుడు కట్లు విప్పుకుని ఏదోలా బయటపడ్డాడు. తనకు డబ్బులు సర్దుబాబు చేసిన ఆనంద్ వద్దకు వెళ్లి విషయం చెప్పడంతో వారిద్దరూ కలిసి ఫోర్త్టౌన్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఘటన జరిగిన దుకాణం వద్దకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలావుండగా ప్రసాద్ తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నట్టు తెలిసింది. దీనిపై ఎస్ఐ ఖగేశ్వరరావును వివరాలు కోరగా రాజునాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేస్తున్నామని, ఈ ఘటనలో తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. దర్యాప్తు పూర్తిచేసిన తర్వాత ఉన్నతాధికారులకు నివేదించి వివరాలను వెల్లడిస్తామన్నారు.