తమిళనాడులో చెలరేగిపోతున్న ఒమైక్రాన్.. మొత్తం కేసుల్లో 85 శాతం అవే!

ABN , First Publish Date - 2022-01-10T02:59:41+05:30 IST

తమిళనాడులో కరోనా వైరస్ చెలరేగిపోతోంది. అక్కడ నమోదవుతున్న కేసుల్లో 80-85 శాతం మంది నమూనాల్లో ‘ఎస్’ జన్యువు

తమిళనాడులో చెలరేగిపోతున్న ఒమైక్రాన్.. మొత్తం కేసుల్లో 85 శాతం అవే!

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ చెలరేగిపోతోంది. అక్కడ నమోదవుతున్న కేసుల్లో 80-85 శాతం మంది నమూనాల్లో ‘ఎస్’ జన్యువు తగ్గుదల కనిపిస్తోంది. ఇది ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని సూచిస్తోంది. మిగతా 15-20 మందిలో డెల్టా వేరియంట్ లక్షణాలు కనిపించినట్టు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ తెలిపారు.


వైరస్ నుంచి రక్షణ కోసం ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని సూచించారు. ‘ఎస్’ జన్యువు తగ్గుదల కనిపించిందంటే వారు ఒమైక్రాన్ వేరియంట్ బారినపడ్డారనే అర్థమని పేర్కొన్నారు. అయితే, మరణాలు నమోదు కాకపోవడం కొంత ఊరటనిస్తోందని తెలిపారు.  


ఒమైక్రాన్ సోకిన వారిలో దాదాపు 90 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారని తెలిపారు. వైరస్ బారినపడినప్పటికీ వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదన్నారు. ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, ఫేస్ మాస్క్ ధరించాలని సూచించారు.


మరోవైపు, కరోనాను అదుపు చేసేందుకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) అధికారులు పలు ఆంక్షలు అమలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. శనివారం 13 పెళ్లళ్ల నిర్వాహకులకు జరిమానా విధించారు. వివాహాలకు వందమందికి మాత్రమే అనుమతి ఉండగా, అంతకుమించి హాజరు కావడంతో చర్యలు తీసుకున్నారు. కాగా, కరోనాను అదుపు చేయడంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఆదివారం పూర్తి లాక్‌డౌన్ ప్రకటించింది. 

Updated Date - 2022-01-10T02:59:41+05:30 IST