రద్దు చేసిన వ్యవసాయ చట్టాలకు 86 శాతం రైతు సంఘాల మద్దతు: సుప్రీంకోర్టు నియమిత కమిటీ

ABN , First Publish Date - 2022-03-21T22:25:10+05:30 IST

రైతుల ఆందోళన కారణంగా రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు 86 శాతం రైతు సంఘాల నుంచి మద్దతు ఉన్నట్టు

రద్దు చేసిన వ్యవసాయ చట్టాలకు 86 శాతం రైతు సంఘాల మద్దతు: సుప్రీంకోర్టు నియమిత కమిటీ

న్యూఢిల్లీ: రైతుల ఆందోళన కారణంగా రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు 86 శాతం రైతు సంఘాల నుంచి మద్దతు ఉన్నట్టు సుప్రీంకోర్టు నియమిత కమిటీ తెలిపింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. వేలాదిమంది రైతులు ఢిల్లీ సరిహద్దులకు దూసుకొచ్చి నెలల తరబడి ఆందోళన నిర్వహించారు. దీంతో వెనక్కి తగ్గిన మోదీ ప్రభుత్వం చట్టాలను వెనక్కి తీసుకుంది. ఈ సందర్భంగా దేశ ప్రజలకు, రైతులకు మోదీ క్షమాపణలు తెలిపారు. ఉద్యయమాన్ని విరమించి రైతులను ఇంటికి వెళ్లాలని కోరారు. 


ఈ వివాదాస్పద చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తాజాగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా 3 కోట్ల మంది రైతులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆందోళన నిర్వహించిన రైతుల సంఘాల్లో 86 శాతం ఈ చట్టాలకు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. వీటిని రద్దు చేయడం ద్వారా నిశ్శబ్దంగా ఉంటూ ఈ చట్టలకు మద్దతు తెలిపిన వారికి ‘అన్యాయం’ జరిగినట్టు పేర్కొంది. 


వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు జనవరి 2020లో వీటిని అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని నియమించింది. ఇందులో తొలుత వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి, షేట్కారి సంఘటన్ (మహారాష్ట్ర) అధ్యక్షుడు అనిల్ ఘన్‌వాట్, అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థకు చెందిన ప్రమోద్ కుమార్ జోషి, భారతీయ కిశాన్ యూనియన్ అధ్యక్షుడు భూపిందర్ సింగ్ మన్ ఉన్నారు. మన్ ఆ తర్వాత కమిటీ నుంచి తప్పుకున్నారు.

Updated Date - 2022-03-21T22:25:10+05:30 IST