అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి.. కొంత కాలంగా..!?

ABN , First Publish Date - 2022-04-26T13:02:25+05:30 IST

అనుమానాస్పదస్థితిలో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన

అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి.. కొంత కాలంగా..!?

చిత్తూరు/పుంగనూరు : అనుమానాస్పదస్థితిలో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన పుంగనూరులో సోమవారం రాత్రి జరిగింది. మండలంలోని మంగళం గ్రామానికి చెందిన గణేశ్‌ మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఆరు నెలల క్రితం పిల్లల చదువుల కోసం కుటుంబాన్ని పట్టణంలోని హైస్కూల్‌వీధిలోకి మార్చాడు. పెద్దకుమారై సూర్యచందన స్థానిక జడ్పీ బాలికల ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. చిన్న కుమారై సూర్యవందన స్థానిక బసవరాజ ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. సోమవారం సూర్యచందన కడుపునొప్పిగా ఉందని పాఠశాలకు సెలవు పెట్టినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు యాధావిధిగా మేస్త్రీ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి సూర్యచందన  ఇంటి ముందు పడి ఉండడంతో దిగ్ర్భాంతి చెందారు. పరిశీలించగా చలనం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.


అయితే ఇంట్లో ఉరివేసుకున్న సూర్యచందనను కిందకు దించే సరికే మృతి చెందిందని స్థానికులు చెబుతున్నారు. గణేశ్‌ మాత్రం తన కుమారైను ఎవరో చంపి ఇంటిముందు ఉంచినట్లు చెబుతున్నాడు. కొంత కాలంగా కారు డ్రైవర్‌ భరత్‌ ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు సూర్యచందన తనతో చెప్పినట్లు గణేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యచందన సూసైడ్‌నోట్‌ రాసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు సంఘటనా స్థలానికి  చుట్టుపక్కల ఆరా తీశారు. విద్యార్థి రాసిన సూసైడ్‌నోట్‌ స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-04-26T13:02:25+05:30 IST