సామూహిక అత్యాచారం అంటూ కట్టు కథ ఎందుకు చెప్పావని పోలీసులు అడిగితే.. ఆ 19 ఏళ్ల యువతి రెస్పాన్స్ ఇదీ..!
ABN , First Publish Date - 2021-12-14T22:56:07+05:30 IST
ఓ యువతి కట్టుకథ అల్లి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది.
ఓ యువతి కట్టుకథ అల్లి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. తనపై సామూహిక అత్యాచారం జరిగిందని చెప్పి సంచలనం సృష్టించింది. దీంతో దాదాపు 1000 మందితో కూడిన 40 పోలీస్ బృందాలు ఆరు గంటల పాటు నిందితుల కోసం గాలించాయి. విచారణాలో ఎక్కడా ఎలాంటి ఆధారాలూ దొరక్కపోవడంతో పోలీసులకు ఆ యువతిపై అనుమానం కలిగింది. ఆమెను ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది. తన బాయ్ఫ్రెండ్తో పెళ్లి కోసమే ఈ కట్టు కథ అల్లినట్టు చెప్పింది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈ ఘటన జరిగింది.
నాగపూర్లోని కాలమ్న పోలీస్ స్టేషన్కు సోమవారం ఉదయం 19 ఏళ్ల యువతి వచ్చి ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారాని పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను సంగీత పాఠశాలకు వెళ్తుండగా ఓ వ్యానులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు తనను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు తెలిపింది. ఫిర్యాదు అందుకున్న నగర పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ హుటాహుటిన వెయ్యి మంది పోలీసులతో 40 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.
నిందితుల కోసం నగరమంతటా గాలించారు. 50 మంది వ్యక్తులను విచారించారు. వ్యాన్లన్నింటినీ తనిఖీ చేశారు. దాదాపు 250 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయినా ఎక్కడా చిన్న ఆధారం కూడా దొరకలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆ యువతిని ప్రశ్నించారు. అప్పుడు ఆ యువతి అసలు విషయం బయటపెట్టింది. తన బాయ్ఫ్రెండ్ను పెళ్లాడడం కోసమే ఈ నాటకం ఆడినట్టు అంగీకరించింది. దీంతో పోలీసులు షాకయ్యారు.