సుప్రీంకోర్టు వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2022-01-21T23:00:08+05:30 IST
ఉత్తర ప్రదేశ్లోని నోయిడాకు చెందిన ఓ వ్యక్తి (50) శుక్రవారం
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్లోని నోయిడాకు చెందిన ఓ వ్యక్తి (50) శుక్రవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టు బయట ఆత్మాహుతి యత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై ఆయనను కాపాడి, ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న ఆయన తన కుటుంబం ఆకలితో బాధపడుతున్నట్లు చెప్పారు.
ఓ వ్యక్తి తనకు తాను నిప్పు పెట్టుకుని, కాలిపోతున్నట్లు గమనించిన పోలీసులు హుటాహుటిన ఆయన బట్టలు తొలగించి, మంటలను ఆర్పేశారు. ఆయనకు మరిన్ని గాయాలు అవకుండా కాపాడి, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ఆయన క్రింద పడిపోయి, తన కుటుంబం ఆకలితో ఉందని చెప్పడం వినిపించింది. తమది చాలా పేద కుటుంబమని చెప్తూ, ఆయన తీవ్ర ఆవేదనతో ఏడుస్తున్నట్లు వినిపించింది.
ఆయనను కాపాడిన ఓ పోలీసు కానిస్టేబుల్ ఆయనతో మాట్లాడుతూ ఆత్మహత్య వల్ల పరిస్థితి మారదని నచ్చజెప్పారు. పోలీసులు మీడియాతో మాట్లాడుతూ, ఆయన వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిసిందని, మరిన్ని వివరాలను రాబట్టవలసి ఉందని చెప్పారు.