దివ్యాంగుడి గొంతుకోసి దారుణ హత్య
ABN , First Publish Date - 2022-10-07T06:10:54+05:30 IST
దివ్యాంగుడి గొంతుకోసి దారుణ హత్య
- నేరుగా పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
మొయినాబాద్, అక్టోబరు 6: మద్యం మత్తులో ఓవ్యక్తి దివ్యాంగుడి గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వెంచర్లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మండలంలోని పెద్దమంగళవారం గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన అమీర్గూడకు చెందిన మేకగూడెం మాణయ్య(50) దివ్యాంగుడు. అదే గ్రామానికి చెందిన మేకగూడం రమేశ్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరి ఇళ్లు ఎదురెదురుగానే ఉంటాయి. మాణయ్యకు చెందిన నాలుగుచక్రాల స్కూటీపై ఇద్దరూ కలిసి తిరుగుతుండేవారు. గురువారం ఇద్దరూ కలిసి మొయినాబాద్ మండల కేంద్రంలోని వైన్స్లో మద్యం తాగారు. అక్కడి నుంచి కల్లు దుకాణానికి వెళ్లి కల్లు తీసుకుని దగ్గరలో ఉన్న ప్రీమియర్ వెంచర్లోకి వెళ్లారు. అక్కడే చెట్టుకింద కూర్చుని ఇద్దరు కల్లు తాగారు. ఈ క్రమంలో ఇద్దరి మద్య మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో రమేశ్ ఆగ్రహంతో స్కూటిలో ఉన్న కత్తితో మాణయ్య గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కొద్దిదూరం ఈడ్చుకెళ్లి వదిలేశాడు. స్కూటీని కూడా మృతదేహం పక్కనే వదిలేసి నేరుగా పోలీ్సస్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు. దీంతో సీఐ లక్ష్మీరెడ్డి సిబ్బందితో ఘటనాస్థలానికి చెరుకుని పరిశీలించారు. క్ల్యూస్ టీంను రప్పించి నమూనాలు సేకరించారు. ఘటనాస్థలంలో పడి ఉన్న ఫోన్, స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య మంజుల, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.