మహారాష్ట్ర తీరంలో ఆయుధాల కలకలం
ABN , First Publish Date - 2022-08-19T06:09:42+05:30 IST
మహారాష్ట్రలో సముద్ర తీరంలో ఓ పడవలో తుపాకులు బయటపడటం కలకలం రేపింది. గురువారం రాయ్గఢ్ తీరంలో పడవలో మూడు ఏకే-47 తుపాకులు, బుల్లెట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ముంబైకు 190 కిలో మీటర్ల..
ఓ పడవలో 3 ఏకే-47 తుపాకులు, బుల్లెట్లు గుర్తింపు..
యజమాని ఆస్ట్రేలియా మహిళ.. కెప్టెన్ ఆమె భర్త
ఉగ్రవాద కోణం లేదని డిప్యూటీ సీఎం ఫడణవీస్ వెల్లడి
ముంబై, ఆగస్టు 18: మహారాష్ట్రలో సముద్ర తీరంలో ఓ పడవలో తుపాకులు బయటపడటం కలకలం రేపింది. గురువారం రాయ్గఢ్ తీరంలో పడవలో మూడు ఏకే-47 తుపాకులు, బుల్లెట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ముంబైకు 190 కిలో మీటర్ల దూరంలో శ్రీవర్ధన్ ప్రాంతంలో మనుషులు ఎవరూ లేని ఈ పడవను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రాయ్గఢ్ ఎస్పీ అశోక్ దూదే, ఇతర పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద కోణం లేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. ‘‘ఈ పడవ పేరు లేడీ హ్యాన్. ఆస్ట్రేలియాకు చెందిన హనా లౌండర్గన్ అనే మహిళ దాని యజమాని. ఆమె భర్త జేమ్స్ హాబర్ట్ కెప్టెన్.
4 మీటర్ల వెడల్పు, 16 మీటర్లు పొడవు ఉన్న ఈ పడవ జూన్లో మస్కట్ నుంచి యూరప్ వెళ్తుండగా ప్రతికూల వాతావరణంలో చిక్కుకుంది. దక్షిణ కొరియాకు చెందిన యుద్ధనౌక సిబ్బంది ఒమన్ తీరంలో వారిని రక్షించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పడవను వదిలేశారు. అందులో మూడు ఏకే-47 తుపాకులు, బుల్లెట్లు, పేపర్లు ఉన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇందులో ఉగ్రవాద కోణం లేదు.’ అని ఫడణవీస్ తెలిపారు. కాగా ఈ పడవ చివరిసారిగా మే-జూన్లో దుబాయ్ నుంచి పయనమైందని, అందులో ముగ్గురు సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. భద్రత సంస్థ నెప్టూన్ మారిటైమ్ సెక్యూరిటీ పడవలోని తుపాకులపై ప్రకటన విడుదల చేసింది. గల్లంతైన ఏకే ఆయుధాల సీరియల్ నంబర్లు, పడవలో ఉన్నవి ఒకటేనని పేర్కొంది. ‘‘అరేబియా సముద్రంలో వర్షాకాలంలో పడవ దెబ్బతింది. ప్రతికూల వాతావరణం వల్ల పడవను ఒడ్డుకు తీసుకురాలేకపోయారు. గురువారం ఉదయం ఈ పడవ గురించి సమాచారం తెలిసింది. మునిగిపోయి ఉంటుందని భావించిన ఈ పడవ భారత్ తీరానికి కొట్టుకుపోయింది’’ అని వెల్లడించింది.