కష్టాల్లో పత్తి రైతు
ABN , First Publish Date - 2022-10-01T05:24:10+05:30 IST
నకిలీ విత్తనాలతో ఒకవైపు, తెగుళ్ల బెడదతో మరోవైపు మండలంలోని పత్తి రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు. మండలంలో యాడికి, చిక్కేపల్లి, బోయరెడ్డిపల్లి, కుందనకోట, గుడిపాడు, వీరారెడ్డిపల్లి, నిట్టూరు, తిప్పారెడ్డిపల్లి, తిరుణాంపల్లి, కొట్టాలపల్లి, వేములపాడు, కమలపాడు, వీరన్నపల్లి, తిమ్మాపురం, పెద్దపేట తదితర గ్రామాల్లో 15966ఎకరాల్లో పత్తిపంటను సాగు చేశారు.
మండల వ్యాప్తంగా 15,966 ఎకరాల్లో సాగు
6 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట
యాడికి : నకిలీ విత్తనాలతో ఒకవైపు, తెగుళ్ల బెడదతో మరోవైపు మండలంలోని పత్తి రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు. మండలంలో యాడికి, చిక్కేపల్లి, బోయరెడ్డిపల్లి, కుందనకోట, గుడిపాడు, వీరారెడ్డిపల్లి, నిట్టూరు, తిప్పారెడ్డిపల్లి, తిరుణాంపల్లి, కొట్టాలపల్లి, వేములపాడు, కమలపాడు, వీరన్నపల్లి, తిమ్మాపురం, పెద్దపేట తదితర గ్రామాల్లో 15966ఎకరాల్లో పత్తిపంటను సాగు చేశారు. ఇందులో సుమారు 4వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో తెగుళ్ల బెడదతో పంటను నష్టపోయారు. మరో 2వేల ఎకరాల్లో నకిలీ పత్తి విత్తనాలతో దిగుబడి లేక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఆగస్టు నెలలో అననుకూల వాతావరణంతో పాటు తలమాడు తెగులుతో పత్తిపంట దిగుబడి లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు రైతులు నాన సర్టిఫైడ్ సీడ్స్ వాడటం, ఇందులో ముఖ్యంగా భూత్పూర్ పత్తి విత్తనాలు, నవ్యరకం పత్తి విత్తనాలు, మరికొన్ని రకాల నకిలీ పత్తివిత్తనాలు వాడటంతో పంటను నష్టపోయినట్లు తెలిపారు. నష్టపోయిన పంట పొలాలను అధికారులు సందర్శించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
తలమాడు తెగులు (టొబాకో సీ్ట్రక్ వైరస్)
ప్రస్తుత ఖరీ్ఫలో తలమాడు తెగులు పత్తి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ తెగులు సోకిన పత్తిపంటలో పూత కాలిపోయి రాలిపోతోందని రైతులు తెలిపారు. పత్తికాయలు బఠాని గింజ అంత సైజులో ఉన్నప్పుడే కాయ కాలిపోతున్నట్లు ఎండిపోతున్నాయని, దీంతో పంట దిగుబడికి ఆస్కారం లేకుండా పోతోందని రైతులు తెలిపారు. మొగ్గలన్నీ తలమాడు తెగులుతో ఎక్కువగా ఎండిపోతున్నట్లు రైతులు తెలిపారు. ఈ తెగులు రసం పీల్చే పురుగుల నుంచే వ్యాప్తి చెందుతున్న ట్లు తమ పరిశీలనలో తేలినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఏ మందులు వాడినా ఈ తెగులు అదుపులోకి రావడం లేదని, ఈ వ్యాధి సోకకుండా కాపాడుకోవడం తప్ప మరేం చేయలేమని, నివారణ కష్ట సాధ్యంగా మారినట్లు వారు చెబుతున్నారు.
ఆగస్టు నెలలో అననుకూల వాతావరణం
ఆగస్టు నెలలో మొదటి రెండువారాలు ఎండలు ఎక్కువగా ఉండటం, తర్వాత రెండు వారాలపాటు వర్షాలు ఎక్కువగా పడటం పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపింది. ఈక్రమంలో తెగులు ఎక్కువగా వృద్ధి చెందినట్లు వ్యవ సాయ అధికారులు చెబుతున్నారు. కొద్దిసంవత్సరాలుగా పంట మార్పిడి లేకపోవడం, పంట విరామం లేకపోవడం కూడా తెగుళ్లు సోకేందుకు ఎక్కువ అవకాశం ఏర్పడిందని అధికారులు తెలిపారు.