ఆప్ ఎమ్మెల్యేకి జైలు శిక్ష... సమర్థించిన సెషన్స్ కోర్టు...

ABN , First Publish Date - 2021-03-24T00:28:23+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి విధించిన జైలు

ఆప్ ఎమ్మెల్యేకి జైలు శిక్ష... సమర్థించిన సెషన్స్ కోర్టు...

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి విధించిన జైలు శిక్షను ఢిల్లీ సెషన్స్ కోర్టు మంగళవారం సమర్థించింది. 2016లో ఢిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) సెక్యూరిటీ స్టాఫ్‌పై దాడి చేయడంతోపాటు ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించిన కేసులో ఆయన దోషి అని ఏసీఎంఎం జనవరిలో తీర్పు చెప్పారు. ఈ తీర్పును సెషన్స్ కోర్టు మంగళవారం సమర్థించిన వెంటనే ఢిల్లీ పోలీసులు ఆయనను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. 


భారత శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్ 149 (చట్టవిరుద్ధంగా సమావేశమవడం), సెక్షన్ 147 (అల్లర్లకు పాల్పడినందుకు శిక్ష), ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడాన్ని నిరోధించే చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం సోమనాథ్ భారతి దోషి అని అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ఏసీఎంఎం) తీర్పు చెప్పారు. ఆయనకు రెండేళ్ళ జైలు శిక్షతోపాటు రూ.1 లక్ష జరిమానా కూడా విధించారు. అపీలు చేసుకోవడానికి వీలుగా ఆయనకు బెయిలు మంజూరు చేశారు. ఈ తీర్పు 2021 జనవరిలో వెలువడింది.  ఈ తీర్పుపై సోమనాథ భారతి అపీలు చేశారు. 


పోలీసుల కథనం ప్రకారం, సోమనాథ భారతి 2016 సెప్టెంబరు 9న దాదాపు 300 మందితో కలిసి ఢి్ల్లీలోని ఎయిమ్స్ ప్రహరీ గోడపై ఉన్న కంచెను జేసీబీ ఆపరేటర్‌తో తొలగించారు. భద్రతా సిబ్బందిపై రాళ్ళదాడి చేశారు. ఎయిమ్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆర్ఎస్ రావత్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. 


Updated Date - 2021-03-24T00:28:23+05:30 IST