Kashmir Encounter : సైనిక జాగిలం వీరమరణం
ABN , First Publish Date - 2022-07-31T15:49:11+05:30 IST
జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir)లోని బారాముల్లా జిల్లాలో
బారాముల్లా : జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir)లోని బారాముల్లా జిల్లాలో ఆదివారం జరిగిన భీకర ఎన్కౌంటర్లో భారత సైనిక దళానికి చెందిన జాగిలం వీరమరణం పొందింది. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో భాగంగా భద్రతా దళాలు చేపట్టిన చర్యల్లో ఈ సంఘటన జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతుడయ్యాడు, ముగ్గురు భద్రతా దళాల సిబ్బందికి గాయాలయ్యాయి.
జమ్మూ-కశ్మీరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉగ్రవాదులు కచ్చితంగా ఎక్కడ ఉన్నారో గుర్తించేందుకు రెండు జాగిలాలను భద్రతా దళాలు వినియోగించాయి. ఈ రెండు జాగిలాలకు బాడీ కెమెరాలను అమర్చి పంపించారు. వీటిని గుర్తించిన ఉగ్రవాదులు వీటిపై కాల్పులు జరిపారు. ఓ జాగిలం వీరమరణం పొందింది.
వానిగామ్ గ్రామంలో ఆదివారం ఉదయం జమ్మూ-కశ్మీరు పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓ పాకిస్థానీ ఉగ్రవాదితోపాటు కనీసం ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు ఈ ఆపరేషన్ను నిర్వహించారు. ఉగ్రవాదుల కదలికలను పర్యవేక్షించేందుకు రెండు సైనిక జాగిలాలను బాడీ కెమెరాలను (bodycamsను) అమర్చి, ఆ ఉగ్రవాదులు ఉంటున్న ఇంట్లోకి పంపించారు. వీటిలో ఒకదాని పేరు బజాజ్ (Bajaj), రెండోదాని పేరు యాక్సెల్ (Axel). వీటిలో యాక్సెల్పై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అత్యంత బాధాకరంగా అది ప్రాణాలు కోల్పోయింది.
పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతున్నప్పటికీ ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోగలిగినట్లు తెలుస్తోంది.