ఈజిప్టు చర్చిలో అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2022-08-15T09:48:38+05:30 IST
ఈజిప్టు రాజధాని కైరోలోని ఇంబాబా జిల్లాలో ఉన్న అబు సిఫైన్ కాప్టిక్ చర్చిలో ఆదివారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదం, 41మందిని బలితీసుకుంది.
41మంది అగ్నికి ఆహుతి
కైరో, ఆగస్టు 14: ఈజిప్టు రాజధాని కైరోలోని ఇంబాబా జిల్లాలో ఉన్న అబు సిఫైన్ కాప్టిక్ చర్చిలో ఆదివారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదం, 41మందిని బలితీసుకుంది. ఈ ప్రమాదం ఎలా సంభవించిందన్నదానిపై స్పష్టత లేదని చర్చి అధికారులు తెలిపారు. ప్రమాదం పట్ల ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసీ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేసి, ఘటన స్థలానికి పంపించామని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన ఫేస్బుక్లో వెల్లడించారు. ఈజిప్టులో ఉన్న సుమారు 10 కోట్లమంది జనాభాలో కోటిమందికి పైగా కాప్టిక్ క్రైస్తవ సంఘాన్ని అనుసరిస్తున్నారు. వీరిపై ఇస్లామిక్ సంఘాల దాడులు పరిపాటిగా మారాయి. ముఖ్యంగా, ఇస్లామిస్టుగా పేరు పొందిన మాజీ అధ్యక్షుడు మహ్మద్ మోర్సీ, 2013లో పదవిని కోల్పోయిన అనంతరం ఈ దాడులు మరింతగా పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. వాటిలో చర్చిలు, పాఠశాలలు, గృహాలను కాల్చి బూడిద చేసే తరహా దాడులూ ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. తాజాగా జరిగిన అనుమానాస్పద అగ్నిప్రమాదం తరహాలో ఇటీవలి కాలంలో మరో మూడు ప్రమాదాలు చోటుచేసుకోవడం గమనార్హం. 2020లో రెండు ఆస్పత్రుల్లో వాటిల్లిన అగ్నిప్రమాదాల కారణంగా 14మంది కొవిడ్-19 రోగులు కన్నుమూయగా, 2021 మార్చిలో కైరోలోని ఒక వస్త్రపరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో 20మంది బలయ్యారు.