ఎమ్మెల్యేకు సమస్యల వెల్లువ
ABN , First Publish Date - 2022-05-24T06:52:02+05:30 IST
మండలంలోని సైతారుపేట గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు సమస్యలు వెల్లువెత్తాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇళ్లకు వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు సమస్యలపై ఏకరువు పెట్టారు.
గడప గడపకు ప్రభుత్వంలో ఏకరువు పెట్టిన ప్రజలు
ఎస్.రాయవరం, మే 23: మండలంలోని సైతారుపేట గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు సమస్యలు వెల్లువెత్తాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇళ్లకు వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు సమస్యలపై ఏకరువు పెట్టారు. భర్త చనిపోయి ఏడాది దాటితున్నా పింఛన్ ఇవ్వలేదని, దీనిపై అడుగుతుంటే కరెంట్ బిల్లు ఎక్కువగా రావడంతో మంజూరు కాలేదని చెబుతున్నారని దాసరి మహాతల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని ఈవోపీఆర్డీ సత్యనారాయణను ఎమ్మెల్యే ఆదేశించారు. దళిత కాలనీలో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని మహిళలు కోరడంతో, రూ.81 లక్షలతో గ్రామంలో ప్రతి ఇంటికీ కొళాయి ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పలువురు మహిళలు తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరడంతో, అర్హులైన వారికి వెంటనే మంజూరు చేయాలని హౌసింగ్ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు సేనాపతి రాము, వైసీపీ నేతలు పి.పెదఈశ్వరరావు, మాతా గురునాథరావు, మామిడి ఎ.అద్దేపల్లి నూకినాయుడు, కొర్ని రాజారమేశ్, అల్లాడ నాగరాజు, అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.