Odishaలో ర్యాగింగ్ భూతం... విద్యార్థిని ఆత్మహత్య...
ABN , First Publish Date - 2022-07-03T19:39:27+05:30 IST
ఒడిశాలోని భువనేశ్వర్లో ఓ అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ విద్యార్థిని
భువనేశ్వర్ : ఒడిశాలోని భువనేశ్వర్లో ఓ అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ విద్యార్థిని (18) తన హాస్టల్ గదిలో శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన సీనియర్లు తనను ర్యాగింగ్, వేధింపులకు గురి చేస్తున్నారని సూసైడ్ నోట్లో ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. ఆమె భువనేశ్వర్లోని ఓ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నారు.
హాస్టల్ సూపరింటెండెంట్ జ్యోతి రథ్ మాట్లాడుతూ, ఈ విద్యార్థిని బీఏ ఆనర్స్ చరిత్ర కోర్సు చదువుతున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆమె రూమ్మేట్లు తరగతులకు హాజరయ్యేందుకు వెళ్ళారని, ఆమె తన గదిలో లోపలి నుంచి గడియ వేసుకున్నారని చెప్పారు. క్లాసుల నుంచి తిరిగి వచ్చిన విద్యార్థినులు గది తలుపులు తెరవకపోవడంతో వారు తమకు సమాచారం ఇచ్చారన్నారు. అనంతరం తాము ఆ గది తలుపులను తెరిచి చూశామని, ఆ విద్యార్థిని మరణించి కనిపించారని తెలిపారు.
ఆత్మహత్యకు ముందు ఆ విద్యార్థిని రాసిన లేఖలో తాను తీవ్ర మనోవేదనతో బాధపడుతున్నట్లు తెలిపారు. ముగ్గురు సీనియర్ స్టూడెంట్స్ తనను తీవ్రంగా ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలిపారు. తన బాధలను తన తల్లిదండ్రులకు, రూమ్మేట్స్కు చెప్పలేకపోతున్నానని పేర్కొన్నారు. అయితే ఆమె ఈ లేఖలో తనను వేధిస్తున్న సీనియర్ల పేర్లను రాయలేదు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.