పెళ్లయిన వారానికే మరో అమ్మాయితో ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతున్న భర్త.. చాటుగా విన్న భార్య.. చివరకు షాకింగ్ సీన్..!
ABN , First Publish Date - 2022-02-12T21:50:42+05:30 IST
వివాహానంతరం నవవధువు భర్తతో కలిసి ఆనందంగా అత్తారింట్లో అడుగుపెట్టింది. అయితే పెళ్లైన వారానికే ఆమె ముఖంలో ఆనందం ఆవిరైంది. భర్త చాటుగా మరొక స్త్రీతో ఫోన్లో మాట్లాడుతున్నట్టు గుర్తిం
ఇంటర్నెట్ డెస్క్: వివాహానంతరం నవవధువు భర్తతో కలిసి ఆనందంగా అత్తారింట్లో అడుగుపెట్టింది. అయితే పెళ్లైన వారానికే ఆమె ముఖంలో ఆనందం ఆవిరైంది. భర్త చాటుగా మరొక స్త్రీతో ఫోన్లో మాట్లాడుతున్నట్టు గుర్తించి కంగుతింది. విషయం ఏంటని భర్తను నిలదీసింది. సోదరి వరుసైన యువతితో మాట్లాడుతున్నట్టు చెప్పడంతో అప్పటికి ఆ గొడవ కాస్త సర్దుమనిగింది. ఆ తర్వాత భర్త ఆమెకు ఊహించిన షాకిచ్చాడు. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్లోని నాగౌర్ ప్రాంతానికి చెందిన ఫిర్దౌస్ అనే మహిళకు మహ్మద్ లతీఫ్ అనే వ్యక్తితో గత అక్టోబర్లో వివాహం జరిగింది. వివాహానంతరం లతీఫ్తో ఫిర్దౌస్ అత్తారింట్లో సంతోషంగా అడుగు పెట్టింది. అయితే పెళ్లైన వారం రోజులకే తన భర్త పరాయి స్త్రీతో ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతున్నట్టు గుర్తించి ఫిర్దౌస్ షాకైంది. అత్తామామల ముందే భర్తను నిలదీసింది. ఈ క్రమంలో సోదరి వరుసైన యువతితో మాట్లాడుతున్నట్టు లతీఫ్ చెప్పడంతో గొడవ సర్దుమనిగింది. తర్వాత కూడా లతీఫ్ ఫోన్లో మాట్లడాన్ని ఫిర్దౌస్ గమనించింది. అయితే అతడి మాటలపై ఉన్న నమ్మకంతో అంతగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో జనవరిలో అస్వస్థతకు గురైన ఫిర్దౌస్తో కలిసి లతీఫ్ ఆసుపత్రికి బయల్దేరాడు.
కానీ ఫిర్దౌస్ని లతీఫ్ నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. మార్గ మధ్యలో స్వీటి అనే యువతిని ఫిర్దౌస్కు పరిచయం చేశాడు. ఆమెకు ఓ ప్రముఖ వైద్యుడు తెలుసని అబద్దాలు చెప్పాడు. తర్వాత ఫిర్దౌస్ను తిన్నగా ఓ లాయర్ దగ్గరకు తీసుకెళ్లాడు. స్వీటిని తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పి షాకిచ్చాడు. ఈ పెళ్లికి ఎటువంటి అభ్యంతరం లేదన్నట్టుగా ఫిర్దౌస్ను సంతకం చేయాలని కోరాడు. దీంతో ఫిర్దౌస్ ఆగ్రహం వ్యక్తం చేసి ఇంటికి తిరిగొచ్చేసింది. అత్తామామలకు భర్త గురించి చెప్పింది. అయితే ఆ విషయాన్ని వాళ్లు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే లతీఫ్.. ఫిర్దౌస్ను ఇబ్బందులకు గురి చేశాడు. తాజాగా ట్రిపుల్ తలాక్ చెప్పి, ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. దీంతో ఫిర్దౌస్ పోలీసులను ఆశ్రయించింది. జరిగింతా చెప్పి, భర్తతోపాటు అత్తామామలపై ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.