Uttar Pradesh : మత్తులో ఉన్న వ్యక్తి ఇచ్చిన సమాచారంతో వీడిన హత్య కేసు మిస్టరీ
ABN , First Publish Date - 2022-05-25T21:51:27+05:30 IST
ఉత్తర ప్రదేశ్లోని భంగేల్ నివాసి అభయ్ త్యాగి (Abhay Tyagi) హంతకులను
నోయిడా : ఉత్తర ప్రదేశ్లోని భంగేల్ నివాసి అభయ్ త్యాగి (Abhay Tyagi) హంతకులను పట్టుకోవడంలో పోలీసులకు ఓ మద్యపాన ప్రియుడు ఇచ్చిన సమాచారం చాలా ఉపయోగపడింది. దాడి జరిగినపుడు హంతకులు వచ్చిన బైక్ రంగును, రిజిస్ట్రేషన్ నంబరులో కొంత భాగాన్ని మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి పాక్షికంగా గుర్తుంచుకుని, పోలీసులకు చెప్పడంతో హంతకులను పట్టుకోగలిగారు.
సెంట్రల్ నోయిడా (Central Noida) అడిషినల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎలమారన్ జీ తెలిపిన వివరాల ప్రకారం, ఫేజ్-1 పోలీస్ స్టేషన్ పరిధిలోని భంగేల్ నివాసి అభయ్ త్యాగి, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి రాత్రి వేళలో ఇంటికి తిరిగి వెళ్తున్నారు. వీరంతా మద్యం సేవించి ఉన్నారు. ఆ సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు రెండు బైక్లపై అక్కడికి వచ్చారు. వీరి మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడి చేసుకోవడంతో త్యాగి మరణించారు. ఆ ముగ్గురు బైక్లపై పారిపోయారు. ఈ సంఘటన మే 14న రాత్రి జరిగింది.
నిందితులను గుర్తించేందుకు పోలీసులకు ఆధారాలు దొరకడం లేదు. అయితే మృతుని స్నేహితుల్లో ఒకరు ఈ సంఘటన జరిగినపుడు మద్యం మత్తులో ఉన్నప్పటికీ నిందితులు వచ్చిన ఓ బైక్ నంబరును పాక్షికంగా గుర్తుంచుకున్నారు. అదేవిధంగా దాని రంగును కూడా గుర్తుంచుకున్నారు. UP 16 CH వరకు మాత్రమే గుర్తు ఉందని, ఆ బైక్ రంగు నల్లగా ఉందని చెప్పారు.
మరొక ఆధారం ఏదీ లభించకపోవడంతో, UP 16 CH, నల్ల రంగు ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు. గౌతమ్ బుద్ధ నగర్లో రిజిస్ట్రేషన్ చేయిస్తే యూపీ 16 సిరీస్ నెంబరు వస్తుంది. భంగేల్ , దాని పరిసరాల్లోని గ్రామస్థులు రిజిస్ట్రేషన్ చేయించిన బైక్ల వివరాలను సేకరించారు. నల్లని రంగులో ఉన్న 100 మోటార్ బైక్ల వివరాలను సేకరించారు. అన్ని మోటార్ సైకిళ్ళను క్షుణ్ణంగా పరిశీలించి, కొందరు యజమానులను ప్రశ్నించారు. చిట్టచివరికి మోహిత్ సింగ్ చౌహాన్ (22), వివేక్ సింగ్ (21)లను ప్రశ్నించారు. వీరిద్దరూ భంగేల్ గ్రామస్థులే. వీరి సెల్ఫోన్ కాల్ డేటాను తనిఖీ చేశారు. తాము మే 14 రాత్రి త్యాగిని హత్య చేశామని వారు అంగీకరించారు. అనంతరం హత్యా నేరం క్రింద ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. మూడో నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించారు.