మద్యం మత్తులో కాలువలో పడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-07-27T05:32:28+05:30 IST
మద్యం మత్తులో కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. సంజీవయ్యనగర్ సీసీ రోడ్డు పక్కన ఉన్న కాలువలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మృతుడు ఖమ్మం జిల్లా వాసి
తాటిచెట్లపాలెం, జూలై 26: మద్యం మత్తులో కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. సంజీవయ్యనగర్ సీసీ రోడ్డు పక్కన ఉన్న కాలువలో ఈ ఘటన చోటు చేసుకుంది. కంచరపాలెం పోలీసుల కథనం మేరకు....ఖమ్మం జిల్లాకు చెందిన మందపాటి సత్యనారాయణరెడ్డి వ్యాపారస్తుడు. నగరంలోని సంజీవయ్య కాలనీలో ఉంటున్న బంధువుల ఇంటికి ఆదివారం ఉదయం సొంతకారులో వచ్చాడు. సాయంత్రం సొంత పనిమీద అనకాపల్లి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతనికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. పదేపదే ఫోన్ చేసినా అదే విధంగా రావడంతో ఏమయ్యిందో అర్థంకాక తెలిసిన వారికి ఫోన్ చేశారు. అయినా ఆచూకీ తెలియలేదు.
కాగా సోమవారం ఉదయం కాలువలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బంధువులు హుటాహుటిన వెళ్లి చనిపోయింది సత్యనారాయణరెడ్డేనని గుర్తించారు. మృతునికి మద్యం అలవాటు ఉంది. అనకాపల్లి నుంచి వస్తూ దారి మధ్యలో మద్యం సేవించినట్టు భావిస్తున్నారు. బహుశా యూరినల్స్ కోసం కాలువ పక్కన ఆగి మద్యం మత్తులో తూలిపడిపోవడంతో చనిపోయి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. కాలువలో మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించారు.