Viral news: వీరప్పన్కు బాబులా ఉన్నాడే.. ఎన్నో ఏళ్లుగా అడవిలోనే జీవితం.. కేవలం ఆ ఒక్క కారణంతోనే..
ABN , First Publish Date - 2021-10-09T22:39:48+05:30 IST
కర్ణాటకలో ఓ వ్యక్తి మాత్రం చిన్న కారణంతో సమాజానికి దూరంగా అడవిలో బతుకుతున్నాడు. అదీ ఎలాంటి సదుపాయాలూ లేని చిన్న గుడిసెలో. 17 ఏళ్లుగా ఇతడి ఒంటరి జీవితానికి కారణమేంటంటే...
కొందరు ఏవేవో కారణాలతో సమాజంపై విరక్తి పెంచుకుంటారు. అలాంటి వారు.. నక్సలైట్లుగా మారి నరమేధం సృష్టించడమో, లేక సమాజానికి దూరంగా వెళ్లి బతకడమో చేస్తుంటారు. ఇక సంసారంపై విరక్తి చెందిన వారు సన్యాసులుగా మారుతుంటారు. కర్ణాటకలో ఓ వ్యక్తి మాత్రం చిన్న కారణంతో సమాజానికి దూరంగా అడవిలో బతుకుతున్నాడు. అదీ ఎలాంటి సదుపాయాలూ లేని చిన్న గుడిసెలో. 17 ఏళ్లుగా ఇతడి ఒంటరి జీవితానికి కారణమేంటంటే...
కర్ణాటకలోని నెక్రల్ కెమ్రాజీ అనే గ్రామంలో చంద్రశేఖర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడికి చెందిన 1.5ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకునేవాడు. అయితే 2003లో సాగు నిమిత్తం బ్యాంక్ నుంచి రూ.40వేలు రుణం తీసుకున్నాడు. పంట నష్టం కారణంగా రుణం తీర్చలేకపోయాడు. దీంతో బ్యాంక్ అధికారులు.. భూమిని వేలం వేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన చంద్రశేఖర్.. తన పాత కారును తీసుకుని తన సోదరి ఇంటికి వెళ్లాడు. కొన్నాళ్ల తర్వాత అక్కడ కూడా ఉండలేక, ఇటు సొంతూరికి వెళ్లలేక.. అరంతోడ్, అద్దేల్ నెక్కారే గ్రామల మధ్య ఉన్న అడవిలోకి వెళ్లిపోయాడు.
అప్పటి నుంచి 17 ఏళ్లుగా మంగళూరు అడవుల్లో ఒంటరిగా ఉంటున్నాడు. చిన్న గుడిసెలో తన కారును పెట్టుకుని, అందులోనే ఉంటున్నాడు. కేవలం రెండు జతల బట్టలు, ఒక జత చెప్పులు, ఓ రెడియో, పాత సైకిల్ మాత్రమే ఇతడి వద్ద ఉన్నాయి. అడవిలో దొరికే కాయలు తింటూ, జలపాతాల వద్ద స్నానం చేస్తూ ఉంటాడు. అడవిలో దొరికే వస్తువులతో బుట్టలు చేసి, వాటిని సమీపంలోని గ్రామాల్లో అమ్మగా వచ్చిన సోమ్ముతో నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసుకుంటాడు. అయితే స్థానిక కలెక్టర్.. ఈయనకు ఇల్లు కట్టిస్తానని చెప్పినా చంద్రశేఖర్ ఒప్పుకోలేదు. తనకు ఎలాంటి ఇబ్బందులూ లేవని, ఆరోగ్యంగా జీవిస్తున్నానని చంద్రశేఖర్ చెబుతున్నాడు.