Karnataka : దుకాణంలో దారుణం... ముసుగు దుండగుల దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు...
ABN , First Publish Date - 2022-07-29T15:50:35+05:30 IST
కర్ణాటక (Karnataka)లోని మంగళూరు (Mangaluru)లో గురువారం
మంగళూరు : కర్ణాటక (Karnataka)లోని మంగళూరు (Mangaluru)లో గురువారం సాయంత్రం దారుణం జరిగింది. ఓ దుకాణంలోకి కొందరు వ్యక్తులు చొరబడి, ఓ వ్యక్తిపై కర్రతోనూ, కత్తితోనూ (Knife Attack) దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. దాడికి పాల్పడిన నలుగురు దుండగులు ముసుగులు ధరించి ఉండటం సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. బాధితుని పరిస్థితి విషమంగా ఉంది.
మంగళూరు పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, బట్టల దుకాణం వద్ద ఉన్న 23 ఏళ్ళ యువకుడిపై నలుగురు గుర్తు తెలియని వ్కక్తులు కత్తులతో దాడి చేశారు. ఆ వీథిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల్లో కారులో వచ్చిన నలుగురు దుండగులు మాస్క్లు ధరించినట్లు కనిపించింది. బాధిత యువకుని పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడి జరిగిన తర్వాత నిషేధాజ్ఞలను అమల్లోకి తీసుకొచ్చారు. ఎక్కువ మంది ఒక చోట చేరకుండా నిషేధించారు. సూరత్కల్, దాని పరిసర ప్రాంతాల్లో ఈ ఆదేశాలు అమలవుతాయి.
బీజేపీ యువ నేత ప్రవీణ్ నెట్టారు (BJP Youth Leader Praveen Nettaru) హత్యానంతరం దక్షిణ కన్నడ (South Kannada) జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మంగళూరు పోలీస్ చీఫ్ శశి కుమార్ మాట్లాడుతూ, ఇది అత్యంత సున్నితమైన ప్రాంతమని చెప్పారు. అందుకే సెక్షన్ 144 ప్రకారం నిషేధాజ్ఞలను అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. సూరత్కల్, దానికి పరిసరాల్లో ఉన్న మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఆదేశాలు అమల్లోకొచ్చినట్లు తెలిపారు. బాధితునిపై దాడికి కారణాలేమిటో తెలియాల్సి ఉందన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ, దక్షిణ కన్నడ జిల్లాలో అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించినట్లు తెలిపారు.