ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి
ABN , First Publish Date - 2022-08-10T06:00:53+05:30 IST
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
- దేశభక్తి పెంపొందించే విధంగా వజ్రోత్సవ కార్యక్రమాలు
- మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, ఆగస్టు 9: స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశం గర్వించేలా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అన్నారు. గడిచిన 75 సంవత్సరాల్లో మనదేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఆగస్టు 8 నుంచి 15 రోజులపాటు వజ్రోత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 3,08,754 ఇళ్లను గుర్తించామని, కరీనంగర్లోని 79,953 గృహాల్లో ప్రతి ఇంటిపై జెండా రెపరెపలాడాలన్నారు. ఆగస్టు 16న దేశభక్తిని పెంపొందించే విధంగా ఎక్కడివారక్కడ ఏకకాలంలో జాతీయ గీతాలాపన చేయాలని, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ వజ్రోత్సవాలను ఆగస్టు 8న హైదరాబాద్లో పెద్ద ఎత్తున ప్రారంభించారని తెలిపారు. ఈ నెల 22 వరకు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. గాంధీ చిత్రాన్ని జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో మంగళవారం నుంచి ప్రదర్శిస్తారని తెలిపారు. అనంతరం మంత్రి ప్రజాప్రతినిధులు, అధికారులకు జాతీయ జెండాలను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ, మేయర్ వై సునీల్రావు, జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, జీవీ శ్యాంప్రసాద్లాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, జిల్లా అధికారులు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఫ నగరంలోని 33వ డివిజన్లో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి గంగుల కమలాకర్ మేయర్ సునీల్రావుతో కలిసి ప్రారంభించారు.