Mumbai sea link : అనేక మంది ప్రాణాలను కాపాడిన మానవతావాది... ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి బలి...

ABN , First Publish Date - 2022-10-06T20:56:26+05:30 IST

ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినవారిని కాపాడి అందరి మన్ననలు

Mumbai sea link : అనేక మంది ప్రాణాలను కాపాడిన మానవతావాది... ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి బలి...

ముంబై : ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినవారిని కాపాడి అందరి మన్ననలు పొందిన మానవతావాది అత్యంత బాధాకర స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదంలో గాయపడినవారికి సాయపడి, ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఆయనపైకి ఓ కారు దూసుకెళ్లడంతో ఈ దారుణం జరిగింది.  ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి అత్యంత విలువైన వ్యక్తి అందరికీ దూరమయ్యారు. 


మాజీ సీనియర్ సెక్యూరిటీ సూపర్‌వైజర్ రాజేశ్ కేదార్ తెలిపిన వివరాల ప్రకారం, చేతన్ కదమ్ (36) మహారాష్ట్రలోని ముంబైలో సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నారు. బాంద్రా-వర్లీ సీ లింక్ (Bandra-Worli sea link) వద్ద ఆయన 2009 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. వర్లీలో దాదాపు పదేళ్ళ క్రితం రోడ్డు ప్రమాదం జరిగినపుడు ఆయన ఓ బాలికను  కాపాడారు. అనంతరం ఆయనను అప్పటి పోలీస్ కమిషనర్ అరూప్ పట్నాయక్ సత్కరించారు. ఓసారి సీ లింక్ వద్ద ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని ఆయన కాపాడారు. ఆ తర్వాత ఆయన చాలా మందిని ఆత్మహత్యాయత్నాల నుంచి కాపాడారు. రోడ్డు ప్రమాద బాధితులను, గాయపడినవారిని నుజ్జునుజ్జు అయిన కార్ల నుంచి చాకచక్యంగా బయటకు తీసి, ఆసుపత్రికి తరలించడంలో ఆయన నేర్పరి. 


ఇదిలావుండగా, బుధవారం రాత్రి 2.40 గంటల ప్రాంతంలో ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. కారు టైర్ పేలిపోవడంతో ప్రమాదం జరిగిందని ఆ కాల్ సారాంశం. హుటాహుటిన ఆయన మరొకరితో కలిసి ఘటనా స్థలానికి వెళ్ళారు. కారులో చిక్కుకున్నవారిని కాపాడేందుకు వీరంతా ప్రయత్నిస్తూండగా, అత్యంత వేగంగా దూసుకొచ్చిన మరో కారు వీరిని ఢీకొట్టింది. దీంతో కదమ్‌తోపాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 


అంబులెన్స్ డ్రైవర్ సోమనాథ్ సాల్వే (29), టోల్ ఉద్యోగులు గజరాజ్ సింగ్ (42), సత్యేంద్ర సింగ్ (35), రాజేంద్ర సింఘాల్ (40), కదమ్ ప్రాణాలు కోల్పోయారు. కదమ్ సహోద్యోగి హేమంత్ తీవ్ర గాయాలతో లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మొదటి ప్రమాదంలో గాయపడినవారికి సహాయపడుతున్న కదమ్ తదితరులపైకి నిర్లక్ష్యంగా కారును పోనిచ్చిన వ్యక్తిని గుర్తించారు. దక్షిణ ముంబైవాసి రియల్ ఎస్టేట్ డెవలపర్ ఇర్ఫాన్ అబ్దుల్ రహీం బీల్కియా ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు ఆయనను అరెస్టు చేశారు. 


కారు టైరు పేలిపోవడంతో జరిగిన ప్రమాదంలో సిద్ధార్థ్ జోయిల్, రేహాన్ పటేల్, అలియా భటీన్, షహానే ఫోర్టునల్  స్వల్పంగా గాయపడ్డారు.  వీరికి సహాయపడటానికి వెళ్లినవారు ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి బలైపోయారు. 


Updated Date - 2022-10-06T20:56:26+05:30 IST