ఏప్రిల్ 20న ఆకాశంలో అద్భుతం.. సరళ రేఖపైకి 4 గ్రహాలు

ABN , First Publish Date - 2022-04-13T00:10:31+05:30 IST

చికాగో: అరుదైన ఖగోళ ఘట్టాలను వీక్షించడం ఎల్లప్పుడూ ఆసక్తికరమే. అలాంటి ఓ అద్భుతాన్ని స్వయంగా చూడాలనుకునేవారికి ఈ నెలలోనే అవకాశం రాబోతోంది.

ఏప్రిల్ 20న ఆకాశంలో అద్భుతం.. సరళ రేఖపైకి 4 గ్రహాలు

చికాగో: అరుదైన ఖగోళ ఘట్టాలను వీక్షించడం ఎల్లప్పుడూ ఆసక్తికరమే. అలాంటి ఓ అద్భుతాన్ని స్వయంగా చూడాలనుకునేవారికి ఈ నెలలోనే అవకాశం రాబోతోంది. సౌరవ్యవస్థలోని నాలుగు గ్రహాలు ఒకే సరళ రేఖపైకి రాబోతున్నాయి. శని, అంగారక, శుక్ర, బృహస్పతి గ్రహాలను ఉత్తరార్ధగోళం నుంచి చూడవచ్చు. ఏప్రిల్ 17 నుంచి పైన పేర్కొన్న గ్రహాలు దాదాపు ఒకే రేఖపైకి వచ్చినట్టు కనిపిస్తాయి. అయితే ఏప్రిల్ 20న ఉదయం సూర్యోదయానికి ముందు మరింత స్పష్టంగా కనుల విందు చేస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే గ్రహాలను చూసేందుకు అనువైన పరిస్థితులు ఉండాలంటున్నారు. శని, అంగారక, శుక్ర గ్రహాలు ఒకే రేఖపైకి రావడం మార్చి చివరి నుంచే మొదలైంది. అయితే ఏప్రిల్ తర్వాత బృహస్పతి కూడా ఈ రేఖపైకి వస్తుంది. ఖగోళ అద్భుతాలు అరుదుగా సంభవిస్తుంటాయి. మరీ ముఖ్యంగా 4 గ్రహాలు ఒకే రేఖపైకి రావడం చాలా చాలా అరుదని పేర్కొంటున్నారు. మరోవైపు ఏప్రిల్ 23న ఈ నాలుగు గ్రహాల సరసన చంద్రుడు కూడా చేరబోతున్నాడు. సరళ రేఖ కుడిపక్కన చందమామ కనిపిస్తుంది. అయితే అంతరిక్షం నుంచి చూస్తే ఒక్కో గ్రహం ప్రత్యేకంగా కనిపిస్తాయి. 


జూన్ లో మరో అద్భుతం

ఈ ఏడాది జూన్ 24న ఇదే తరహాలో మరో అద్భుతం దర్శనమివ్వబోతోంది. సౌరవ్యవస్థలోని బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని, నెప్ట్యూన్, యురేనస్ ఒకే రేఖపైకి వచ్చి వీక్షకులను ఆకట్టుకోనున్నాయని చికాగోలోని అడ్లెర్ ప్లానెటేరియానికి చెందిన ఆస్ట్రానమీ ఎడ్యుకేటర్ మిచెల్లీ నికోలస్ చెప్పారు. అయితే నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను చూడడానికి బైనాక్యులర్ లేదా టెలీస్కోప్ అవసరమవుతుందని సూచించారు. ఈ దృశ్యాన్ని ఫొటోలు తీయడం చాలా కష్టమని పేర్కొన్నారు. ఆకాశంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం చాలా చాలా అరుదుగా ఉంది. 2005 నుంచి ఇప్పటికి కేవలం మూడు సార్లు మాత్రమే ఇలాంటి అద్భుతాలు జరిగాయి. ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రాబోవని చెప్పారు.

Updated Date - 2022-04-13T00:10:31+05:30 IST