ప్రొఫెసర్ జయశంకర్ కృషితోనే ప్రత్యేక రాష్ట్రం
ABN , First Publish Date - 2021-06-22T05:58:23+05:30 IST
ప్రొఫెసర్ జయశంకర్ సార్ కృషితోనే ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకుని నీళ్లు, నిధులు, నియామకాలతో బంగారు తెలంగాణ వైపు ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
ఆదిలాబాద్టౌన్, జూన్ 21: ప్రొఫెసర్ జయశంకర్ సార్ కృషితోనే ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకుని నీళ్లు, నిధులు, నియామకాలతో బంగారు తెలంగాణ వైపు ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని జయశంకర్ సార్ విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ జయశంకర్ సార్ అధ్యాపకులుగా పనిచేస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధనకు బాటలు వేశారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఆంధ్రవారి నుంచి తెలంగాణ ప్రజలకు సిద్ధించే వరకు పోరాటం చేశారని గుర్తుచేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సైతం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు. ఇందులో నాయకులు అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, కౌన్సిలర్లు శ్రీనివాస్, బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
తలమడుగు: ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ లోకభూమారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని రుయ్యాడి గ్రామంలో జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఇందులో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, సర్పంచ్ పోతారెడ్డి, గోకభూమారెడ్డి, సుదర్శన్రెడ్డి, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.
బోథ్: తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను గుర్తించి మూడు తరాలకు బోధించి ఊపిరిపోసిన ఉద్యమకారుడు జయశంకర్ సార్ అని బోథ్ మార్కెట్ కమిటీ ఆత్మచైర్మన్లు దావుల భోజన్న, మల్లెపూల సుభాష్ పేర్కొన్నారు. సోమవారం బోథ్లో జయశంకర్ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ రుక్మన్సింగ్, ఎంపీటీసీ చల్ల ఉమేష్ రజిని, బి.శ్రీధర్రెడ్డి సర్పంచ్ ఎల్కరాజు, భీమ బుచ్చన్న, బీరం రవి, బొడ లక్ష్మణ్ ఉన్నారు.
ఉట్నూర్: మండలంలో జయశంకర్ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో జయశంకర్ చిత్ర పటానికి ఎంపీడీవో తిరుమల, ఎంపీపీ పంద్ర జైవంత్రావులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మోస పోతున్నారని గుర్తించిన జయశంకర్ సీఎం కేసీఆర్ను ఉద్యమ నాయకుడిగా నియమించుకోని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, సింగిల్ విండో చైర్మన్ ఎస్పీ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.