ఏడేళ్ల చిన్నారి కళ్ల ఎదుటే తండ్రిపై కాల్పులు

ABN , First Publish Date - 2022-05-25T08:13:41+05:30 IST

శ్రీనగర్‌ శివారులోని సౌర అనే ప్రాంతంలో ఉగ్రవాదులు మంగళవారం దారుణానికి ఒడిగొట్టారు.

ఏడేళ్ల చిన్నారి కళ్ల ఎదుటే తండ్రిపై కాల్పులు

కశ్మీర్‌ ఉగ్రవాదుల చేతిలో కానిస్టేబుల్‌ మృతి

ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన రాహుల్‌ భట్‌ కుటుంబాన్ని పరామర్శిస్తున్న 

లెఫ్టినెంట్‌ గవర్నర్‌


న్యూఢిల్లీ, మే 24 : శ్రీనగర్‌ శివారులోని సౌర అనే ప్రాంతంలో ఉగ్రవాదులు మంగళవారం దారుణానికి ఒడిగొట్టారు. ఓ ఏడేళ్ల చిన్నారి కళ్ల ఎదుటే అమె తండ్రిపై కాల్పులకు తెగబడ్డారు. తన కూతురితో కలిసి ఇంటి బయటికి వచ్చిన సైఫుల్లా ఖాద్రీ అనే పోలీసు కానిస్టేబుల్‌పై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సైఫుల్లా ఆస్పత్రిలో మరణించారు. బుల్లెట్‌ గాయానికి గురైన అతని కూతురు ప్రస్తుతం చికిత్స పొందుతుంది. ఇక, రెండు వారాలుగా ఆందోళన బాట పట్టిన కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులు.. తమను సురక్షిత ప్రాంతానికి తరలించే వరకు ఉద్యోగాల్లో చేరమని స్పష్టం చేశారు. చివరికి జమ్ము కశ్మీర్‌ లెఫ్టనెంట్‌ గవర్నర్‌ వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినా విధుల్లో చేరేందుకు నిరాకరించారు. కశ్మీర్‌లోని బడగామ్‌ జిల్లాలో మే 12న జరిగిన ఘటనలో రాహుల్‌ భట్‌ అనే ఉద్యోగిని అతని కార్యాలయంలోనే లష్కరే తొయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. అయితే, ప్రధానమంత్రి ప్రత్యేక ఉపాధి పథకం కింద ఉద్యోగాలు పొందిన దాదాపు 4000 మంది కశ్మీరీ పండిట్‌లు అప్పట్నించి ఆందోళన బాట పట్టారు. కాగా.. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన జమ్ము కశ్మీర్‌ పోలీసులకు ఇచ్చే ‘షేర్‌-ఐ-కశ్మీర్‌’ మెడల్‌ పేరును జమ్ము అండ్‌ కశ్మీర్‌ పోలీసు మెడల్‌గా మార్చారు. మెడల్‌పై ఉండే షేఖ్‌ మహ్మద్‌ అబ్దుల్లా చిత్రాన్ని తొలగించి జాతీయ చిహ్నాన్ని ముద్రిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 

Updated Date - 2022-05-25T08:13:41+05:30 IST