గద్వాలలో సెక్స్ రాకెట్
ABN , First Publish Date - 2022-08-10T05:22:51+05:30 IST
జోగుళాంబ గద్వాల జిల్లాలో కొంతకాలంగా సెక్స్ రాకెట్ జోరుగా సాగుతోంది. పట్టణంలోని కొన్ని శివారు కాలనీల్లో ఈ రాకెట్ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
బెంగళూరు, గుంటూరు, కలకత్తా, హైదరాబాద్ల నుంచి యువతులు
నిర్వాహకులు ఆంధ్రపదేశ్కు చెందిన వారు
ఫోన్లో ఫొటోలు పంపి నెరుపుతున్న వ్యవహారం
నిర్వాహకులకు కొందరు నాయకుల సహకారం
పట్టుపడిన వారిని వదిలేస్తున్న పోలీసులు
గద్వాల క్రైం, ఆగస్టు 9: జోగుళాంబ గద్వాల జిల్లాలో కొంతకాలంగా సెక్స్ రాకెట్ జోరుగా సాగుతోంది. పట్టణంలోని కొన్ని శివారు కాలనీల్లో ఈ రాకెట్ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రాకెట్ వెనుక నిర్వాహకులకు పెద్ద నాయకులు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లా కేంద్రంలోని ఆ కాలనీల్లో..
గద్వాల పట్టణ శివారులోని సాయి హోంకాలనీలో, రెండవ రైల్వేగేట్ సమీపంలోని బీరెల్లి రోడ్లోని ఉన్న ఓ ఇంటితో పాటు మరికొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరు ఈ రాకెట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. నిర్వాహకులకు ఆంధ్రప్రదేశ్తో పాటు గద్వాలకు చెందిన కొందరు మీడియేటర్ల సహకారం ఉన్నట్లు సమా చారం. గతంలో పట్టణంలోని సాయి హోం కాలనీలో పట్టుపడిన రాకెట్ నిర్వాహకులు, మీడియేటర్తో పాటు విటులను కూడా కొందరు నాయకుల ఒత్తిడితో పోలీసులు వదిలేశారని, కేసు కూడా చేయలేదని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అందు కోసం రూ.3 లక్షల ముడుపులు చేతులు మారినట్లు చర్చ జరిగింది. తాజాగా రెండు రోజుల కిందట సెకండ్ రైల్వే గేట్ కాలనీలోని బీరెల్లి రూట్లో ఈ రాకెట్లో యువతులు, విటులతో పాటు నిర్వాహకురాలు, మీడియేటర్పై కేసులు నమోదు చేశారు. కానీ ఇందులో కూడా కొందరు వ్యక్తులు తప్పిచ్చుకున్నట్లు తెలుస్తోంది. వారిని ఎవరైనా తప్పించారా? అన్నది తెలియాల్సి ఉంది.
బెంగళూరు నుంచి అమ్మాయిలు
నిర్వాహకులు బెంగళూరు, కలకత్తా, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, కర్నూల్ నుంచి యువతులను రప్పిస్తున్నారు. వారి ఫొటోలు మీడియేటర్లు విటులకు వాట్సాప్ ద్వారా పంపుతారు. వారిలో నచ్చిన వారిని ఎంపిక చేసుకుని, నిర్వాహకులు చెప్పిన అడ్రస్కు వెళ్లి కార్యం కానిస్తున్నారు. అయితే ఈ యువతులు మూడు రోజులే ఉంటారు. ఆ తర్వాత కొత్తవారు వస్తారని తెలుస్తోంది.
సూత్రధారులు వారే..
ఈ సెక్స్ రాకెట్ను విజయవాడ, గుంటూరు, ఒంగోలుకు చెందిన వారు నిర్వాహిస్తున్నారు. వీరికి కొందరు నాయకులు మీడియేటర్లుగా ఉండటంతో పాటు పోలీసులు పట్టుకుంటే ఎలాంటి కేసులు నమోదు కాకుండా చూస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా సాయి హోం కాలనీలో పట్టుబడ్డ విటులను, నిర్వాహకులను ఇలాగే వదిలివేసినట్లు తెలుస్తోంది. ఇలా కొందరిని వదిలేసి, మరికొందరిపై తూతూ మంత్రంగా కేసులు నమోదు చేయడం, ఇంకొందరిని కేసులో లేకుండా చేయడంలో ఈ నాయకులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. సెక్స్ రాకెట్ను పూర్తిగా నిర్మూలించడంలో జిల్లా అధికారులు, పోలీసులు విఫలం అయినట్లు తెలుస్తోంది.
చర్యలు తీసుకుంటాం
జిల్లా కేంద్రంలో ఇటీవలే వ్యభిచారం కేసులో కొందరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఓ వ్యక్తి పారిపోయాడు. అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటాం. ఇల్లు అద్దెకు ఇచ్చేవారు కూడా అన్ని విషయాలు పరిశీలించి అద్దెకు ఇవ్వాలి. ఇలాంటి విషయాలు తెలిస్తే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వ్యభిచారం కేసులో ఎవరినీ ఊపేక్షించేది లేదు.
- చంద్రశేఖర్, సీఐ, గద్వాల.