సాదాసీదాగా సర్వసభ్య సమావే శం
ABN , First Publish Date - 2022-07-07T06:36:26+05:30 IST
ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిర్వహించే మండల సర్వసభ్యసమావేశం సాదాసీదాగా ముగించారు.
- పూర్తిస్థాయిలో హాజరుకాని సర్పంచ్లు
రుద్రంగి జూలై 6: ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిర్వహించే మండల సర్వసభ్యసమావేశం సాదాసీదాగా ముగించారు. మూడు నెలలకు ఒక సారి నిర్వహించే సర్వసభ్య సమావేశంలో ప్రజాసమస్యలపై గళమెత్తాల్సిన ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో హాజరుకాకపోవడంతో సమావేశం తూతూ మంత్రంగా సాగింది. రుద్రంగి మండల కేంద్రంలోగల రైతువేదికలో ఎంపీపీ గంగం స్వరూపరాణి అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రజాప్రతినిధులు ప్రతి సర్వసభ్య సమావేశానికి వచ్చి వెళ్తున్నారే తప్ప గ్రామంలోని సమస్యలను ప్రశ్నించడం లేదు. ఇదిలా ఉంటే రుద్రంగి మండలంలో 10 మంది సర్పంచ్లు ఉండగా అడ్డబోరు తండా సర్పంచ్ మోహన్ మాత్రమే హాజరయ్యారు. మిగితా తొమ్మిది మంది సర్పంచ్లు హాజరుకాలేకపోయారు. దీంతో ప్రజల సమస్యలపై మాట్లాడే వారు లేకుండా పోయారు. ఈ సందర్భంగా ఎంపీపీ గంగం స్వరూపరాణి మాట్లాడుతూ రుద్రంగి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన మురికి కాలువ సరిగా నిర్మించకపోవడంతోనే రోడ్డుపైన వర్షం నీరు ఆగుతుందని ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని మిషన్భగిరథ సంబంధించిన సమస్యలను 15 రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాల కోసం ప్రభుత్వ భూమిని గుర్తించాలని తహసీల్దార్ భాస్కర్ను ఆదేశించారు. పంటల మార్పిడితోనే అధిక లాభాలు వస్తాయని, రైతులు ఆయిల్పామ్ సాగు చేస్తే అధిక లాబాలు పొందవచ్చాన్నారు. అనంతరం జడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ సర్వసభ్య సమావేశానికి అన్ని గ్రామాల సర్పంచ్లు హాజరుకావాలన్నారు. ప్రజల సమస్యలను సభ దృష్టికి తీసుకువస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సమావేశం అనంతనం మంచె భూమయ్య అనే రైతు రుద్రంగిలో మొట్ట మొదటగా రెండు ఎకారాల్లో 100 ఆయిల్పామ్ చెట్లను సాగుకు ముందుకు రావడంతో రైతుకు ఆయిల్పామ్ మొక్కను ప్రజాప్రతినిధులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, వైస్ఎంపీపీ పిసరి చిన్న భూమయ్య, ఎంపీటీసీ మంచే లావణ్య రాజేశం, సర్పంచ్ మోహన్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.