దేశవ్యాప్తంగా ఒకే గ్రామీణ బ్యాంకు

ABN , First Publish Date - 2022-09-24T06:25:24+05:30 IST

దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకులన్నింటినీ కలిపి ఒకే బ్యాంకుగా ఏర్పాటు చేయాలని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఉద్యోగ, ఆఫీసర్ల సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు.

దేశవ్యాప్తంగా ఒకే గ్రామీణ బ్యాంకు
ఎస్జీబీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న బ్యాంకు ఉద్యోగులు

సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఉద్యోగ, ఆఫీసర్ల సంఘ నేతల డిమాండ్‌

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 23: దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకులన్నింటినీ కలిపి ఒకే బ్యాంకుగా ఏర్పాటు చేయాలని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఉద్యోగ, ఆఫీసర్ల సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. జాతీయ స్థాయి గ్రామీణ బ్యాంకు ఉద్యోగ సంఘం పిలుపు మేరకు శుక్రవారం స్థానిక ఎస్జీబీ ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్‌ శక్తులకు అప్పగించాలని కుట్ర పన్నుతోందని ఆరోపించారు. గ్రామీణ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు దొడ్డిదారిన ఏర్పాట్లు చేస్తోందని, దీన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ వల్ల బ్యాంకులతో పాటు ఖాతాదారులు నష్టపోయే ప్రమాదముందన్నారు. గ్రామీణ బ్యాంకు ఉద్యోగులకు జాతీయ బ్యాంకులతో సమానంగా ప్రమోషన్‌, సర్వీస్‌ రూల్స్‌, పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని కోరారు. క్యాజువల్‌ స్వీపర్స్‌, మెసెంజర్లను పర్మినెంట్‌ చేయాలని కోరారు. ఎస్జీబీ బ్యాంకు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎస్‌.అశోక్‌కుమార్‌, ఎస్జీబీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హరిశశి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, ఎస్జీబీ రిటైర్డ్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ అధ్యక్షుడు పీఎల్‌ ఆనందరెడ్డి, ఎస్జీబీ క్యాజువల్‌ స్వీపర్స్‌ అండ్‌ మెసెంజర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రాజేష్‌ మాట్లాడారు.

Updated Date - 2022-09-24T06:25:24+05:30 IST