ఢిల్లీలో బయటపడిన చారిత్రక సొరంగం

ABN , First Publish Date - 2021-09-03T17:36:28+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీలో స్వాతంత్ర్య సంగ్రామ కాలంనాటి

ఢిల్లీలో బయటపడిన చారిత్రక సొరంగం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో స్వాతంత్ర్య సంగ్రామ కాలంనాటి చారిత్రక సొరంగం బయటపడింది.  శాసన సభ వద్ద ఈ నిర్మాణాన్ని గుర్తించారు. ఇది ఎర్ర కోట వరకు ఉన్నట్లు చెప్తున్నారు. ఢిల్లీ శాసన సభ సభాపతి రామ్ నివాస్ గోయల్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఈ సొరంగం శాసన సభ నుంచి ఎర్ర కోట వరకు ఉందన్నారు. బ్రిటిష్ పరిపాలకులు ఈ సొరంగాన్ని ఉపయోగించేవారని, స్వాతంత్ర్య సమర యోధులను ఎటువంటి ప్రతీకార చర్యలకు అవకాశం లేకుండా ఈ మార్గంలో తీసుకెళ్ళేవారని చెప్పారు. తాను 1993లో ఎమ్మెల్యేగా ఎన్నికైనపుడు ఇక్కడి సొరంగం గురించి తనకు తెలిసిందన్నారు. తాను దీని చరిత్రను తెలుసుకోవడం కోసం ప్రయత్నించానని, అయితే స్పష్టత రాలేదని చెప్పారు.


ఈ సొరంగం ప్రారంభ స్థానం కనిపించిందని, మిగిలిన సొరంగాన్ని గుర్తించేందుకు తవ్వకాలు జరపబోమని చెప్పారు. ఈ సొరంగ మార్గంలో మెట్రో ప్రాజెక్టు, మురుగు కాలువల నిర్మాణం జరగడంతో, దీనికి సంబంధించిన మార్గాలన్నీ ధ్వంసమయ్యాయని చెప్పారు. 1912లో భారత దేశ రాజధానిని కోల్‌కతా నుంచి ఢిల్లీకి మార్చారన్నారు. ఆ తర్వాత ఢిల్లీ శాసన సభ భవనాన్ని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఉపయోగించేవారన్నారు. 1926లో ఈ భవనాన్ని న్యాయస్థానంగా మార్చారన్నారు. స్వాతంత్ర్య సమర యోధులను న్యాయస్థానానికి తీసుకెళ్ళడానికి ఈ సొరంగ మార్గాన్ని ఉపయోగించేవారని చెప్పారు. 


ఇక్కడ ఉరి కంబం గది ఉన్నట్లు అందరికీ తెలుసునని చెప్పారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా తాను ఆ గదిని పరిశీలించాలనుకుంటున్నట్లు తెలిపారు. దీనిని స్వాతంత్ర్య సమర యోధుల పవిత్ర స్థలంగా మార్చి, నివాళులర్పించాలనుకుంటున్నామని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటం విషయంలో ఈ ప్రదేశానికి చాలా చరిత్ర ఉందన్నారు. పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శించి, మన చరిత్రను తెలుసుకునేలా చేయాలనుకుంటున్నామని తెలిపారు.

Updated Date - 2021-09-03T17:36:28+05:30 IST