జర్నలిస్టు ఖషోగ్గీ హత్య కేసు విచారణను సౌదీ అరేబియాకు అప్పగించిన టర్కీ

ABN , First Publish Date - 2022-04-07T21:23:46+05:30 IST

సౌదీ అరేబియాతో సంబంధాలను చక్కదిద్దుకోవడానికి

జర్నలిస్టు ఖషోగ్గీ హత్య కేసు విచారణను సౌదీ అరేబియాకు అప్పగించిన టర్కీ

ఇస్తాంబుల్ : సౌదీ అరేబియాతో సంబంధాలను చక్కదిద్దుకోవడానికి టర్కీ ఓ ముందడుగు వేసింది. జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్య కేసులో సౌదీ నిందితులపై విచారణను నిలిపేయాలని టర్కీ కోర్టు గురువారం ఆదేశించింది. ఈ కేసుపై విచారణను సౌదీ అరేబియాకు అప్పగించింది. 26 మంది సౌదీ నిందితుల పరోక్షంలో విచారణ జరపవద్దని, దీనిని  సౌదీ అరేబియాకు బదిలీ చేయాలని గత వారం ప్రాసిక్యూటర్ కోరారు. 


టర్కీ న్యాయశాఖ మంత్రి ఇటీవల మాట్లాడుతూ, ప్రాసిక్యూటర్ విజ్ఞప్తిని ప్రభుత్వం ఆమోదిస్తుందని తెలిపారు. అయితే మానవ హక్కుల సంఘాలు టర్కీ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి, తీవ్రంగా ఖండించాయి. 


అమెరికన్ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ 2018 అక్టోబరు 2న హత్యకు గురయ్యారు. ఆయన సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని విమర్శించేవారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌లోకి ఆయన వెళ్ళినపుడు ఈ హత్య జరిగింది. 


Updated Date - 2022-04-07T21:23:46+05:30 IST