Shocking News: తన భర్త ఓ మహిళ అని తెలుసుకోడానికి ఆ భార్యకు ఎనిమిదేళ్లు పట్టింది!

ABN , First Publish Date - 2022-09-16T15:32:35+05:30 IST

గుజరాత్‌కు చెందిన ఓ మహిళకు 2014లో వివాహమైంది

Shocking News: తన భర్త ఓ మహిళ అని తెలుసుకోడానికి ఆ భార్యకు ఎనిమిదేళ్లు పట్టింది!

వడోదర : గుజరాత్‌కు చెందిన ఓ మహిళకు 2014లో వివాహమైంది. తన భర్త అంతకుముందు ఓ మహిళ అనే విషయం ఆమెకు ఆలస్యంగా తెలిసింది. ఎంత ఆలస్యమంటే ఎనిమిదేళ్ళ పైమాటే! దీంతో ఆమె బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త, అత్తింటివారు తనను మోసం చేశారని, తనతో ఆ వ్యక్తి అసహజ శృంగార కార్యకలాపాలు జరిపారని  ఆరోపించారు. 


గుజరాత్‌లోని వడోదరకు చెందిన మహిళ (40) గోత్రి పోలీస్ స్టేషన్‌కు సమర్పించిన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, తన భర్త విరాజ్ వర్ధన్ తనను మోసం చేశారని ఆరోపించారు. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ మోసంలో భాగస్వాములేనని ఆరోపించారు. తొమ్మిదేళ్ళ క్రితం విజేయిత పేరుతో ఆ వ్యక్తి తనకు ఓ మేట్రిమోనియల్ సైట్‌లో పరిచయమయ్యారని తెలిపారు. తన మొదటి భర్త రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తనకు 14 ఏళ్ళ వయసుగల కుమార్తె ఉన్నట్లు తెలిపారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వీరిద్దరి వివాహం 2014 ఫిబ్రవరిలో జరిగింది. వీరి వివాహానికి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత కశ్మీరులో హనీమూన్ చేసుకున్నారు. అయితే ఆ వ్యక్తి శోభనంలో పాల్గొనలేదు. చాలా రోజుల వరకు రకరకాల సాకులు చెప్తూ వచ్చారు. బాధితురాలు ఒత్తిడి తెచ్చిన తర్వాత, తనకు కొన్నేళ్ళ క్రితం రష్యాలో ప్రమాదం జరిగిందని, శృంగారంలో పాల్గొనే సామర్థ్యం కోల్పోయానని చెప్పారు. ఓ చిన్న శస్త్ర చికిత్స చేయించుకుంటే అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. తన బరువు తగ్గించుకోవడానికి శస్త్ర చికిత్స చేయించుకుంటానని చెప్పి 2020 జనవరిలో కోల్‌కతా వెళ్ళారు. చిట్ట చివరికి ఆ వ్యక్తి అసలు నిజాన్ని బయటపెట్టారు. తాను సెక్స్ ఛేంజ్ ఆపరేషన్ చేయించుకుని, పురుష సంబంధిత అవయవాలను పెట్టించుకున్నానని చెప్పారు. ఈ శస్త్ర చికిత్సకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆ వ్యక్తి బయటపెట్టలేదు. 


నిందితుడు(రాలు) విరాజ్ వర్ధన్ లేదా విజెయితను ఢిల్లీ నుంచి వడోదర తీసుకొచ్చినట్లు గోత్రి పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎంకే గుర్జర్ చెప్పారు. 


Updated Date - 2022-09-16T15:32:35+05:30 IST