యువతికి నిద్రలో నడిచే అలవాటు.. అదే వాళ్ల కొంపముంచింది.. రూ.15లక్షల విలువైన బంగారాన్ని తీసుకెళ్లి..
ABN , First Publish Date - 2022-07-08T16:26:27+05:30 IST
కొందరికి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంటుంది. ఆ కొంత మందిలో తమిళనాడుకు చెందిన మహిళ కూడా ఉంది. ఆమెకు ఉన్న ఈ అలవాటే కొంప ముంచింది. రూ.15లక్షల విలువైన బంగారాన్ని తీసుకెళ్లి.. డస్ట్ బిన్లో పడేసేలా
ఇంటర్నెట్ డెస్క్: కొందరికి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంటుంది. ఆ కొంత మందిలో తమిళనాడుకు చెందిన మహిళ కూడా ఉంది. ఆమెకు ఉన్న ఈ అలవాటే కొంప ముంచింది. రూ.15లక్షల విలువైన బంగారాన్ని తీసుకెళ్లి.. డస్ట్ బిన్లో పడేసేలా చేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ఇంటికి తిరిగొచ్చేలా చేసింది. స్థానిక న్యూస్ ఛానల్స్లో కూతురి దృశ్యాలు ప్రసారం కావడంతో కూతురి నిర్వాకం తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని కాంచిపురం జిల్లాలో ఉన్న కుండ్రత్తూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ప్రస్తుతం 35ఏళ్లు. తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న ఆ మహిళకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే తాజా ఆమె షాకింగ్ పని చేసింది. ఉదయం 4 గంటలకు ఇంట్లో ఉన్న రూ.15లక్షల విలువైన బంగారాన్ని తీసుకుని బయటకు వెళ్లి.. బంగారంతో కూడిన బ్యాగును మురుగన్ టెంపుల్ రోడ్డులో ఉన్న ప్రైవేటు బ్యాంకు ఏటీఎం డస్ట్బిన్లో పడేసింది. ఆ తర్వాత ఉదయం 7 గంటలకు ఏమీ తెలియనట్టు ఇంటికి తిరిగొచ్చింది.
కాగా.. బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది ఏటీఎం వద్ద ఉన్న డస్ట్బిన్లో బ్యాగును గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు.. బ్యాగును పరిశీలించి అందులో బంగారాన్ని గుర్తించారు. అనంతరం అక్కడ రికార్డైన సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి.. వాటిని స్థానిక న్యూస్ఛానల్స్లో ప్రచారం చేశారు. కూతురి దృశ్యాలు న్యూస్ ఛానల్స్లో రావడం చూసి ఆ తల్లిదండ్రులు కంగుతిన్నారు. వెంటనే అధికారులను సంప్రదించగా కూతురి నిర్వాకం వారి దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే తమ కూతురికి ఉన్న అలవాటు గురించి పోలీసులకు చెప్పి, తమ బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్గా మారింది.