అప్పికొండ బీచ్లో యువకుడు గల్లంతు
ABN , First Publish Date - 2022-05-16T05:48:20+05:30 IST
పెదగంట్యాడ సమీపంలోని అప్పికొండ బీచ్లో ఈతకు దిగిన ఓ యువకుడు సముద్రంలో గల్లంతయ్యాడు. దువ్వాడ సీఐ లక్ష్మి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మరొకరిని రక్షించిన మత్స్యకారులు
కూర్మన్నపాలెం, మే 15: పెదగంట్యాడ సమీపంలోని అప్పికొండ బీచ్లో ఈతకు దిగిన ఓ యువకుడు సముద్రంలో గల్లంతయ్యాడు. దువ్వాడ సీఐ లక్ష్మి తెలిపిన వివరాలిలా ఉన్నాయి..పెదగంట్యాడ మండలం మద్దివానిపాలేనికి చెందిన మద్ది రాజు(22) తనకు వరుసకు సోదరుడైన మద్ది అనిల్తో కలసి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అప్పికొండ బీచ్కు వెళ్లారు. అనంతరం ఈ ఇద్దరూ సముద్రంలో ఈతకు దిగారు. ఈ సమయంలో అలల ఉధృతికి సముద్రలోకి కొట్టుకుపోయారు. అక్కడ ఉన్న మత్స్యకారులు సముద్రలోకి దిగి అనిల్ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. చీకటిపడడంతో రాజు ఆచూకీ లభ్యం కాలేదు.
ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న మద్ది శంకరరెడ్డికి ఇద్దరు సంతానం. కూతురికి వివాహం కాగా, కొడుకు రాజు ఐటీఐ పూర్తిచేసి, వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అందివస్తాడనుకున్న ఒక్కగానొక్క కొడుకు గల్లంతు కావడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దువ్వాడ సీఐ లక్ష్మి కేసు దర్యాప్తు చేస్తున్నారు.