అమానుషం!

ABN , First Publish Date - 2021-07-27T04:12:45+05:30 IST

ఆస్తి తగదాల నేపథ్యంలో సొంత బాబాయ్‌నే పొట్టన పెట్టుకున్నాడు ఓ యువకుడు. తల్లిదండ్రుల సాయంతో దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఆపై సహజ మరణంగా చిత్రీకరించి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యా

అమానుషం!
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు



సొంత బాబాయ్‌నే హత్యచేసిన ఓ యువకుడు

సహకరించిన కుటుంబ సభ్యులు

సహజ మరణంగా చిత్రీకరణ

పోలీస్‌ విచారణలో హత్యగా నిర్థారణ

ఆస్తి వివాదాలే కారణం

లక్కవరపుకోట, జూలై 26: ఆస్తి తగదాల నేపథ్యంలో సొంత బాబాయ్‌నే పొట్టన పెట్టుకున్నాడు ఓ యువకుడు. తల్లిదండ్రుల సాయంతో దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఆపై సహజ మరణంగా చిత్రీకరించి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదుచేశారు. అక్కడి ఆనవాళ్లను గమనించిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. హత్యగా నిర్థారించారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. సోమవారం రేగలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గొల్ల విశ్వనాథం, గొల్ల ఈశ్వరరావు (45) సోదరులు. ఆస్తి పంపకాల నేపథ్యంలో గత కొన్నిరోజులుగా వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఈశ్వరరావు భార్య అనారోగ్యానికి గురికావడంతో ఇద్దరు పిల్లలతో కలిసి విశాఖలో ఉంటున్నారు. ఈశ్వరరావు ఒక్కరే స్వగ్రామంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సోదరుల మధ్య వివాదం రేగింది. ఈశ్వరరావు ఇంటికి వెళ్లి పడుకున్నాడు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న  విశ్వనాథం కుమారుడు అప్పారావు... బాబాయ్‌ ఈశ్వరరావు తలపై గునపంతో మోదాడు. దీంతో ఈశ్వరరావు ఘటనా స్థలంలోనే కన్నుమూశాడు. వెంటనే విశ్వనాథం, ఆయన భార్య దేముడమ్మ, అప్పారావు భార్య లక్ష్మిలు అక్కడికి చేరుకున్నారు. మృతదేహం నుంచి కారుతున్న రక్తాన్ని తుడిచేశారు. దుస్తులను మార్చి సహజ మరణంగా చిత్రీకరించారు. ఆదివారం ఉదయం అంత్యక్రియలకు ఏర్పాటుచేస్తుండగా స్థానికులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఎస్‌ఐ లక్ష్మణరావు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఘటనాస్థలంలో అనుమానాస్పద ఆనవాళ్లు కనిపించాయి. అప్పటికే అప్పారావు పరారయ్యాడు. మిగతా కుటుంబసభ్యులను విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిందితుడు అప్పారావు  నేర సంస్కృతి కలిగిన వ్యక్తి అని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గతంలో పశువుల దొంగతనం వంటి వాటికి పాల్పడేవాడని..అడిగిన వారిపై తిరగబడే వాడని చెబుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని సర్పంచ్‌ రావాడ నీలకంఠం డిమాండ్‌ చేశారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు. 





Updated Date - 2021-07-27T04:12:45+05:30 IST