‘పురి’పుష్ట శకం!
ABN , First Publish Date - 2020-10-27T05:52:47+05:30 IST
అతనొక దుర్గం! అనితర సాధ్యం ఆయన మార్గం!! అతడే ఆదిత్య పురి. హెచ్డీఎ్ఫసీ బ్యాంక్ వ్యవస్థాపక
హెచ్డీఎ్ఫసీ బ్యాంక్తో ముగిసిన ఆదిత్య పురి అనుబంధం
అతనొక దుర్గం! అనితర సాధ్యం ఆయన మార్గం!! అతడే ఆదిత్య పురి. హెచ్డీఎ్ఫసీ బ్యాంక్ వ్యవస్థాపక సారథి. బ్యాంక్ పాతికేళ్ల మహా ప్రస్థానానికి దస్తూరి. ఈ బ్యాంక్ ఆరంభం దగ్గరి నుంచి దేశంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో నెం.1గా అభివృద్ధి చేయడం వరకు ఆయనదే కీలకపాత్ర. బ్యాంకింగ్ అంటేనే రిస్క్తో కూడుకున్న వ్యాపారం. ఆర్థిక మోసాలు, మొండిబకాయిలు ఇండస్ట్రీని కుదిపేస్తున్న తరుణంలోనూ తన బ్యాంక్పై వాటి ప్రభావం పడనీయకుండా లాభాల పథంలో నిలకడగా ముందుకు తీసుకెళ్లగలిగిన ఘనత అతనిది. స్నేహం, వ్యాపారానికి ముడిపెట్టొదనే నిర్మొహమాట, నిక్కచ్చి బ్యాంకర్.
అందుకే, దేశంలోని ఇతర బ్యాంక్లకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ అప్పు కోసమొస్తే కప్పు కాఫీ ఇచ్చి సరిపెట్టాడు. బ్యాంకర్గా అద్వితీయ ఇన్నింగ్స్ ఆడిన ఆదిత్య పురి శకం ఇక ముగిసింది. హెచ్డీఎ్ఫసీ బ్యాంక్ ఎండీ, సీఈఓగా ఆయన పదవీకాలం సోమవారంతో పూర్తయింది. ఇకపై హెచ్డీఎ్ఫసీ బ్యాంక్కు శశిధర్ జగదీశన్ సారథ్యం వహిస్తారు. దేశీయ బ్యాంకింగ్ రంగ అభివృద్ధికి తనవంతు సహకారం అందించడంతోపాటు ఇండస్ట్రీ వర్గాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆదిత్య పురికి హెచ్డీఎ్ఫసీ బ్యాంక్ ప్రధాన ప్రత్యర్థి ఐసీఐసీఐ బ్యాంక్ సైతం ధన్యవాదాలు తెలిపింది.