ప్రధాని దృష్టికి ఆవభూముల అవినీతిని తీసుకెళ్తాం
ABN , First Publish Date - 2021-07-27T05:37:40+05:30 IST
బూరుగుపూడిలో ఆవభూముల అవినీతిని త్వరలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ద్వారా ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా దృష్టికి తీసుకెళతామని అఖిల పక్ష రైతు సంఘం నాయకుడు అడపా శ్రీనివాస్ తెలిపారు.
కోరుకొండ, జూలై 26: బూరుగుపూడిలో ఆవభూముల అవినీతిని త్వరలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ద్వారా ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా దృష్టికి తీసుకెళతామని అఖిల పక్ష రైతు సంఘం నాయకుడు అడపా శ్రీనివాస్ తెలిపారు. గోదావరి వరద నీటితో సుమారు 10 అడుగుల లోతును ముంపునకు గురైన అయ్యన్న గళ్ళ ఆవభూములను సోమవారం వివిధ పార్టీలకు చెందిన నాయకులు, రైతులు పరిశీలించారు. ఆవభూముల్లో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అవినీతికి అడ్డాగా మారిందని ఆరోపించారు. గత రెండేళ్లుగా 3 సార్లు ఆవభూములు మునిగిపోయాయని, ఈ భూముల్లో ఇళ్లు కట్టుకుంటే నిత్యం పడవల్లో ప్రయాణం చేయాలని ధ్వజమెత్తారు. నాలుగు రోజులుగా 600 ఎకరాల ఆవభూములు నీటమునిగిపోతే ఇంత వరకు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు కానీ పర్యటించకపోవడంపై అఖిలపక్ష నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణం ప్రభుత్వం సేకరించిన ఆవభూముల్లో వరదనీటి లోతు ఎంత ఉందో పరిశీలించాలని వారు డిమాండ్ చేశారు. పర్యటనలో బీజేపీ నాయకులు మోదీ సత్తిబాబు, ఎ.రమేష్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ శ్రీరాజ్, రామకృష్ణ, టీడీపీ నుంచి మారిశెట్టి రమణ, దోసకాయలపల్లి సర్పంచ్ ధారా రాంబాబు, రిపబ్లికన్ ఇండియన్ పార్టీ ప్రతినిధి పిట్టా వరప్రసాద్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకుడు కొత్తపల్లి భాస్కర రామం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు నాగులపాటి బాలాజీ, జనసేన నాయకులు, మహిళలు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.