ఏ సైకో కళ్లల్లో ఆనందం కోసం ఇలా చేశారు?: ఏబీవీ

ABN , First Publish Date - 2022-04-22T20:29:30+05:30 IST

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.

ఏ సైకో కళ్లల్లో ఆనందం కోసం ఇలా చేశారు?: ఏబీవీ

న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సస్పెన్షన్ కాలం పూర్తయినందున మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా ఏబీవీ మీడియాతో మాట్లాడుతూ తనపై కావాలనే విషప్రచారం చేశారన్నారు. తన సస్పెన్షన్‌పై ప్రభుత్వ ఎస్‌ఎల్పీని న్యాయస్థానం కొట్టివేసిందన్నారు. చట్ట ప్రకారమే తాను పోరాటం చేశానని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఏ సైకో కళ్లల్లో ఆనందం చూడ్డం కోసం ఇలా చేశారు?.. ఇదంతా జరిగేందుకు కారకులెవరని ఆయన ప్రశ్నించారు. సస్పెన్షన్‌ను ప్రశ్నించడమే తన తప్పా..? అని ఏబీవీ నిలదీశారు.


ఈ కేసు రెండేళ్ల రెండు నెలలపాటు కొనసాగిందని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. న్యాయవాదులకు ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. ఒక తప్పుడు నివేదిక ఆధారంగా 24 గంటల్లో తనను సస్పెండ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరునెలల కోసారి సస్పెన్షన్‌ పొడిగిస్తూ రిపోర్టులిచ్చారన్నారు. ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించిన అధికారులపై ఫిర్యాదు చేశానన్నారు. కొనుగోలు అనేదే లేనప్పుడు అవినీతి ఎలా జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. తనను, తన కుటుంబాన్ని క్షోభ పెట్టి ఏం సాధించారన్నారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన అధికారుల నుంచి.. రెవెన్యూ రికవరీ చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-22T20:29:30+05:30 IST